ప్రతిష్ఠాత్మక 91వ ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రపంచ దేశాల నుంచి సినీ ఇండస్ట్రీ కదిలి వచ్చింది. ఆస్కార్ అవార్డు రావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చిత్రాలను దాటుకొని అవార్డు కైవసం చేసుకోవాలి. అలాంటిది ప్రతిష్ఠాత్మక 91వ ఆస్కార్ వేడుకలో మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తర్ప్రదేశ్లోని హపూర్ ప్రాంతంలో తెరకెక్కించారు.
ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్ న్యాప్కిన్లు ఎలా తయారుచేయాలో నేర్చుకుంటారు. వాటిని ఇతర మహిళలకు తక్కువ ధరకు అమ్ముతూ ఎలా సాయపడ్డారు అన్నదే ఈ డాక్యుమెంటరీ కథ. అయితే ఈ చిత్రం తీసే సమయంలో తాను సామాజిక సేవా ధృక్పదంతోనే దర్శకత్వం చేపట్టానని..తాజాగా ఆస్కార్ అవార్డు అందుకున్న సమయంలో రేకా జెహ్తాబ్చి మాట్లాడుతూ..ఓ మై గాడ్. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య గురించి నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది.
నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఓ డాక్యుమెంటరీ చిత్రం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా నిర్మాత గునీత్ మోంగా ట్వీట్ చేస్తూ.. ‘మనం గెలిచాం. ఈ భూమ్మీదున్న ప్రతీ ఆడపిల్ల తనని తాను ఓ దేవతలా భావించాలి’ అని పేర్కొన్నారు.