ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఏపీ రాజకీయాలన్నీ చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సమయంలో వపన్ కల్యాణ్ మైనస్ పాయింట్లు ఇవీ అంటూ టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన తాజా వీడియోలో విశ్లేషించారు.
పవన్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటానని చెప్పుకుంటున్నా.. ఆయనలో ఆవేశం తప్ప ఆలోచన కనిపించడం లేదన్నారు తమ్మారెడ్డి. గతంలో ప్రజారాజ్యంలో జరిగిన తప్పులే ఇప్పుడు పవన్ జనసేనలో జరుగుతున్నట్టు అనిపిస్తోందన్నారు. జనసేన మరో ప్రజారాజ్యం కాకుండా చూసుకోవాలని సూచించారు.
చిరంజీవి దేనికైనా కొంత తలొగ్గుతారని, ఆయనలో మెతకదనం ఉందన్న తమ్మారెడ్డి.. ఆ మెతకదనం వల్ల ఆయనకు నష్టం జరిగిందన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడానికి ఆ మెతకవైఖరే కారణమన్నారు. అదే మెతకవైఖరి ఆయనను మెగాస్టార్ను చేసిందన్నారు.
చిరంజీవిలో ఓ సుగుణం ఉందని, తాను పట్టిన దానికి మూడే కాళ్లు అనరని, ఏదైనా ఓ విషయాన్ని పదిమందితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటారని తమ్మారెడ్డి విశ్లేషించారు. పవన్ కల్యాణ్ విషయంలో ఆవేశం మైనస్ పాయింట్ అవుతుందన్నారు. జాగ్రత్తగా అడుగులు వేయకపోతే.. చిరంజీవి తరహాలో పవన్ కూడా అభాసుపాలవుతారని హెచ్చిరించారు.