ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటిన చిత్రం బాహుబలి, బాహుబలి2. రాజమౌళి ఐదు సంవత్సరాలు కష్టపడి తీసిన ఈ చిత్రం కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగించింది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి సంవత్సరం గ్యాప్ తీసుకున్న తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా `ఆర్ ఆర్ ఆర్` (వర్కింగ్ టైటిల్) తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో రాజమౌళి ఏ విషయంలోనూ రాజీ పడటంలేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించుకుంటూ టాప్ టెక్నీషియన్లతో ముందుకు వెళ్లున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతుంది. త్వరలో కోల్ కొతాలో 40 రోజుల పాటు షూటింగ్ జరుపబోతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్లుగా మొదట సమంత, కీర్తి సురేశ్, అదితి రావు హైదరి, పరిణీతి చోప్రా పేర్లు వినిపించాయి. కానీ ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసే నేపథ్యంలో అక్కడ హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అలియా భట్ ని ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అలియా ఎంతో గౌరవించే నిర్మాత కరణ్ జోహార్ ద్వారా ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాకపోతే.. రెమ్యునేషన్ విషయంలో మాత్రం అలియా భట్ కు కాస్త ఎక్కువే డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో కరన్ జోహార్ డీల్ చేస్తే హీరోయిన్ పక్కా అయినట్లే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.