బాహుబలి సీరిస్ తో బాలీవుడ్ స్థాయి నుండి హాలీవుడ్ స్థాయికి ఒక్కసారే ప్రఖ్యాతి గాంచిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా విడుదల కోసం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతడి సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్-డేట్ అయినా వైరల్ అయిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి "సాహో" కాగా, ఇంకోటి "జిల్" ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో చేస్తున్నది. "సాహో" ఎలాంటి సినిమా అనే విషయంలో ముందు నుంచే స్పష్టత ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని విశేషాలు బయటికి వచ్చాయి.
రాధాకృష్ణకుమార్ సినిమా గురించి మాత్రం అధికారికంగా ఏ సమాచారం ఇప్పటి దాకా బయటికి రాలేదు. ఐతే ఇది ఒక ప్రేమకథ అని, కొన్ని దశాబ్దాల క్రితం నేపథ్యంలో నడుస్తుందని, పునర్జన్మలతో ముడిపడ్డ కథ ఇండియాతో పాటు యూరప్ నేపథ్యంలోనూ సాగుతుందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు ఈ విషయం లో స్వయంగా దర్శకుడు రాధాకృష్ణకుమార్ ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తయినట్లు వెల్లడించిన అతను, ఇదొక కాలాతీతమైన ఇద్దరు ప్రేమికుల కథ అని, 1970ల నాటి కాలంలో యూరప్ నేపథ్యంలోనే సాగు తుందని వెల్లడించాడు. అంటే ప్రభాస్ దాదాపు 50ఏళ్ల ముందటి చారిత్రాత్మక లుక్ లో కనిపిస్తాడన్నమాట. మొత్తానికి ఈ సినిమా గురించి ఇప్పటి దాకా వచ్చిన రూమర్ల లో చాలా వరకు నిజమే అని రాధాకృష్ణకుమార్ ఖరారు చేశాడు.
ఈ చిత్ర తొలి షెడ్యూల్ ను యూరప్ లోనే పూర్తి చేశారు. కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న రెండో షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే హైదరాబాద్ లోనే మూడో షెడ్యూల్ మొదలవుతుంది. రోమ్ నగరాన్ని తలపించే సెట్టింగ్స్లో మూడో షెడ్యూల్ చిత్రీకరించనున్నారు.