బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ పెరిగింది అన్నది నిజం. అయితే ఇందులో ప్రభాస్ క్రేజ్ కంటే దర్శకుడు రాజమౌళి బ్రాండ్ సినిమా మార్కెట్ను పెంచింది. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సాహో సినిమా బడ్జెట్ ఏకంగా రూ.150 కోట్ల పైమాటే.
కళ్లు చెదిరిపోయే ఖర్చుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఓ రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు. సాహోను తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో రిలీజ్ చేస్తున్నా రాజమౌళి క్రేజ్ వేరు... సుజీత్ వేరు. సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా నిర్మాతలు, బయ్యర్లు నిండా మునిగిపోతారు. కోలుకోవడం కూడా చాలా కష్టం. సాహో సంగతి ఇలా ఉంటే ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ” జాన్ ” అనే చిత్రం కూడా చేస్తున్నాడు . ఈ సినిమా కోసం ఏకంగా 80 కోట్ల రూపాయలతో చాలా సెట్లు వేస్తున్నారు.
యూరప్లో ఉన్న పలు సెట్లను హైదరాబాద్లో వేసి మరీ షూట్ చేస్తున్నారు. ఓవరాల్గా సినిమా మేకింగ్కే ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో మొత్తం యూరప్ సెట్స్తో జాన్ కోసం నిండిపోయిఉందట. జాన్ కోసం పెడుతోన్న ఖర్చు చూసి టాలీవుడ్ వర్గాలు మొత్తం షాక్ అవుతున్నాయి. ఈ స్థాయి బడ్జెట్ పెరుగుతూ పోతుంటే అది చిత్ర పరిశ్రమకు ఎంతమాత్రం మంచిది కానేకాదన్న అభిప్రాయం కూడా ఇటీవల ఇండస్ట్రీలో ఎక్కువుగా వినిపిస్తోంది.
పెద్ద సినిమాలు ఘోరంగా దెబ్బతిన్నప్పుడు అందరూ నష్టపోతున్నారు. యేడాదికి 15 పెద్ద సినిమాలు వస్తే అందులో పట్టుమని 3-4 కూడా హిట్ కాని పరిస్థితి. పెద్ద హీరోలు ప్రతి సినిమాకు బడ్జెట్ పెంచుకుంటూ పోతే నాలుగైదు సినిమాలకు ఒక్క హిట్ వస్తే పరిస్థితి ఏంటన్నది ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఇప్పుడు ప్రభాస్ కూడా బాహుబలి క్రేజ్తో వాపు చూసి బలుపు అనుకుంటే రాంగ్ స్టెప్పే అవుతుంది. ఈ రెండు సినిమాలు తేడా కొడితే చాలా మంది దుకాణం బంద్ చేసుకునే పరిస్థితి వస్తుంది.