మహానటి చిత్రానికి ఎనలేని అంతర్జాతీయ గౌరవం - షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక కావటం తో లభించినట్లైంది. "విశ్వవిఖ్యాత నట సామ్రాఙ్జి" అనక పోయినా ఆ స్థాయి నట సామర్ధ్యంతో పాటు అందం అభినయం ఆహార్యం ఉన్న కళానిలయం అలనాటి నటి సావిత్రి. ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన "మహానటి" బయోపిక్ సినిమా అద్భుతమైన విజయాన్ని, నిర్మాతకు కాసుల పంట పండించింది. జీవన చిత్రాల్లో అద్భుత గౌరవాన్ని నమోదు చేసింది.
వైజయంతి మూవీస్ పతాకంపై చలసాని అశ్వినిదత్ నిర్మించిన ఈ చిత్రరాజాన్ని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో పరిశోధన చేసి వెండి తేరమీద వెన్నెల జిలుగుల సౌందర్యాన్ని పండించాడు. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటన అందర్నీ ఆకట్టుకుంది. వెండితెరపై పరకాయ ప్రవేశంతో మాయ చేసిన కీర్తి సురేష్ ‘మహానటి’ చిత్రం బుల్లి తెరపై కూడా అదే రీతిలో తన జైత్ర యాత్ర కొనసాగించి అదరగొట్టింది. ఈ మూవీ గత యేడాది 20.21 టీఆర్పీ రేటింగ్తో టాప్లో నిలిచింది.
తాజాగా ఈ సినిమాకు మరో అద్భుతమైన గౌరవం లభించింది. 22 వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (శీFF) కు మహానటి సినిమా ఎంపికయ్యింది. అంతేకాదు, శీFF కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం గా ఇది చరిత్ర పుటల్లోకి చేరింది. "ఇంటర్నేషనల్ పనోరమ విభాగం" లో ఈ సినిమాను ఎంపిక చేశారు. ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా మెయిన్ ల్యాండ్ చైనా లో ‘మహానటి’ సినిమాను ప్రదర్శించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటి కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ సహా దక్షిణాది ప్రముఖ తారలంతా ఈ చిత్రంలో నటించారు.
2018 లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా మహానటి నిలిచిన సంగతి తెలిసిందే. మహానటి చిత్రాన్ని తెరకెక్కించిన విధానం, నటీనటుల పని తీరుకు ప్రేక్షకుల నుండి అపూర్వ స్పందన వచ్చింది. 2018 మే 9న విడుదలైన ఈ చిత్రం 50 రోజులకు పైగా విజయవంతంగా ప్రదర్శింపబడింది. తన నటనతో ప్రజల హృదయాల్లో మహానటి సావిత్రి సంపాదించుకున్న సుస్థిర స్థానానికి ఈ సినిమా సాధించిన విజయమే నిదర్శనం. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నీరాజనాలు లభించాయి. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.