ప్రస్తుతం అంతటా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది. చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు మధ్యాహ్నం 3 అయిందంటే టీవీలకి అతుక్కుపోతున్నారు. ఇండియా మ్యాచ్ల సమయంలో అయితే బయట జనసంచారం కూడా తగ్గుతుంది. ఇక ఎప్పుడు కళకళలాడే సినిమా థియేటర్స్ కూడా వెలవెలపోతున్నాయి.
వరుస సినిమాలు థియేటర్స్లోకి వస్తున్నప్పటికి ప్రేక్షకుల సంఖ్య మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ క్రమంలో కలెక్షన్స్ కూడా భారీగా డ్రాప్ అవుతున్నాయి. ఇవన్నీ ముందుగా ఊహించిన ఇస్మార్ట్ శంకర్ టీం తమ చిత్రాన్ని జూలై 18కి వాయిదా వేశారు.
ముందుగా ఈ చిత్రాన్ని జూలై 12 విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే వరల్డ్ కప్ మ్యాచ్లు జూలై 14తో ముగియనుండగా, ఆ తర్వాత రిలీజ్ చేస్తే సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందని టీం భావించింది. మొత్తానికి ముందుగా అనుకున్న డేట్ కంటే ఆరు రోజుల తర్వాత చిత్రం రిలీజ్ కానుందన్నమాట.
‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు.