టాలీవుడ్ లో సీనియర్ అయిన పోసాని కృష్ణమురళి స్టైలే వేరు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసే పోసాని అటువైపు ఎవరున్నా లెక్కచేయకుండా ఓపెన్ గా మాట్లాడుతుంటారు. కొద్దిరోజులుగా రాజకీయంగా కూడా పలు విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్న పోసాని.. గత రెండేళ్లుగా ఏపీలో మాజీ సీఎం చంద్రబాబును తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తనయుడు లోకేష్‌ను టార్గెట్ గా చేసుకుని తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. 


వైసీపీకి.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు ఎన్నికల్లో తన బలమైన వాయిస్ తో సపోర్ట్ చేసిన పోసాని తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో జరిగిన ఎన్నికల్లో అయితే జగన్‌కు మద్దతుగా మాట్లాడుతూ చంద్రబాబు, టీడీపీని ఒక ఆట ఆడుకున్నారు. చాలామంది టీడీపీ నాయ‌కులు చివరకు అతనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేయలేదంటే పోసాని మాట‌ల దాడి ఎలా ? ఉందో తెలుస్తోంది. 


ఇదిలా ఉంటే ఎన్నికలు ముగిశాక స్వల్ప అనారోగ్యానికి గురైన పోసాని కోలుకుని తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే పోసాని మళ్లీ రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసినందుకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం తగ్గిపోయాయని... దీని వెనక ఎవరెవరు ? ఉన్నారో కూడా తనకు తెలుసని పోసాని బాంబు పేల్చారు. ఇటీవల ఓ పెద్ద సినిమాలో తనకు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింద‌ని చెప్పారు. ఇక మ‌రో సినిమాలో అవ‌కాశం రాకుండా పోవ‌డానికి అశ్వ‌నీద‌త్ కార‌ణ‌మ‌న్నారు. 


ఇండస్ట్రీలో టిడిపికి సపోర్టర్స్ చాలామంది ఉన్నారు. కొందరు హీరోలతో పాటు ఇండస్ట్రీ పెద్దల్లో మెజార్టీ వర్గాలు టిడిపి కి సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. ఆ వర్గం వాళ్ళు త‌మ సినిమాల్లో పోసానిని దూరం పెడితే ఇక.. జనసేన - నాగబాబు - పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన క్రమంలో మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో కూడా ఆయనకు ఛాన్సులు ఇవ్వ‌ర‌నే ప్రచారం జరుగుతోంది. అందుకే పోసాని మరోసారి ఓపెన్ గా తనకు సినిమా ఛాన్సులు ఎవ‌రు ఇవ్వడం లేదో తెలుసంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: