నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్గా నటించిన చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ కోవలోనే క్రేజీ హీరో విజయ దేవరకొండతో పాటు హీరో అడవిశేషు, దర్శకుడు తరుణ్ భాస్కర్, ఆనంద్ దేవరకొండ తదితరులు గచ్చిబౌలి ఎఎంబి సినిమాస్లో ఈ సినిమాను చూసి తమ స్పందన తెలియచేశారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఆరేళ్లకు పైగా నవీన్ బాగా తెలుసు. థియేటర్స్లో వర్క్ షాప్ చేస్తున్నప్పుడు ఇద్దరం కలిసి చాలా ఎంజారు చేసేవాళ్ళం. ఆ తరువాత 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో కలసి పనిచేశాం. మళ్లీ ఇప్పుడు ఇలా కలిశాం. నవీన్ హీరో హీరోగా చేసిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమా నాకు బాగా నచ్చింది. టెక్నీకల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. స్వరూప్ డైరెక్షన్ అదిరిపోయింది. మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకు నవీన్ నటన పెద్ద ఎస్సెట్.
నా నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా ఇదే స్పందన రావడం చూసి సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్ ఇలా సక్సెస్ అయ్యాడని గర్వంగా కూడా ఉంది. ఇండిస్టీలో నవీన్లాంటోడు మరొకడు లేడు అని చెప్పగలను. ఇంకో కొత్త సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నవీన్. మరిన్ని మంచి సినిమాలు చేస్తూ విజయం సాధించాలని ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
దర్శకుడు స్వరూప్ మాట్లాడుతూ.. చిన్న పిల్లల నుంచి 70 ఏళ్ల వయసు పెద్ద వారు కూడా నేను ఎక్కడ కనపడితే అక్కడ మంచి సినిమా తీశారంటూ మెచ్చుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాత రాహుల్ మాట్లాడుతూ.. డిటెక్టివ్ జోనర్ సినిమాలు ఈ మధ్య రావడం లేదు వచ్చినా ప్రేక్షకులు చూడటం లేదు అలాంటి తరుణంలో మా సినిమాను చూస్తారా? అని మొదట భయపడ్డాను కానీ మా సినిమా విడుదల తరువాత ఆ భయం, ఆలోచన రెండూ పోయాయి. అని పేర్కొన్నారు.