టాలీవుడ్ లో నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా పలువిధాలుగా తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవలందించిన శ్రీమతి విజయనిర్మల నిన్న రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం పొందిన విషయం తెలిసిందే. నటరత్న ఎన్టీఆర్ గారు నటించిన పాండురంగ మహత్యం చిత్రంతో టాలీవుడ్ కు నటిగా ప్రవేశించిన విజయ నిర్మల, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగారు. 

ఇక నటిగానే కాక, దర్శకురాలిగా ఏకంగా 44 సినిమాలకు దర్శకత్వం వహించి, మహిళా దర్శకురాలిగా గిన్నిస్ రికార్డు సాధించారు. ఇక నటుడు సూపర్ స్టార్ కృష్ణతో వివాహం తరువాత తన విజయకృష్ణ మూవీస్ పై పలు సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించిన ఆమె, కృష్ణ గారితో దాదాపుగా 50 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అయితే మొదట హీరోయిన్ గా కృష్ణ గారితో కలిసి ఆమె నటించిన సాక్షి సినిమా తరువాత వారిద్దరికీ వివాహమైన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ ఒక కృష్ణుడి గుడిలో జరుగుతున్న సమయంలో, సినిమా సీన్ లో భాగంగా కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి పెళ్లి జరిగే సీన్ షూట్ చేయడం జరిగిందట. 

ఇక షూటింగ్ అనంతరం అందరూ ఇళ్లకు చేరుకునే సమయంలో అప్పటి హాస్య నటుడు రాజబాబు, ఈ గుళ్లో ఎవరికైనా ఒకసారి పెళ్లి జరిగితే వారు కలకాలం కలిసి ఉండటం తథ్యం అని అన్నారట. అంతే, ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత కొన్నాళ్ళకు నిజజీవితంలో విజయ నిర్మల గారు, కృష్ణ గారిని వివాహమాడడం జరిగింది. అయితే ఈ విధంగా తమ పెళ్లి అలా జరగడానికి రాజబాబు గారు సాక్షి సినిమా పెళ్లి సీన్ షూటింగ్ సమయంలో అన్న మాటే కారణమని, ఆ విధంగా మా పెళ్ళికి రాజబాబు గారు కారణమయ్యారని విజయనిర్మలగారు నవ్వుతూ అప్పటి సందర్భాన్ని గతంలో ఆమె ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో గుర్తుచేసుకునేవారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: