సినిమా చూసి నేను నవ్వుకున్నాను. చూసిన వారంతా అద్భుతంగా ఉందని అంటున్నారు అని అన్నారు శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం బ్రోచేవారెవరురా. వివేక్ ఆత్రేయ దర్శకుడు. విజయ్ కుమార్ మన్యం నిర్మించారు. నివేథా థామస్, సత్యదేవ్, నివేతా పెతురాజ్ కీలక పాత్రలను పోషించారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర థాంక్స్‌మీట్ జరిగింది.

 

ఈ వేడుకకు దర్శకులు తరుణ్‌భాస్కర్, శివనిర్వాణ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ సినిమా చూసి బాగుందని కేటీఆర్‌తో పాటు తరుణ్‌భాస్కర్, నాని, వెంకటేష్ ప్రోత్సహించారు. విమర్శకుల ప్రశంసల్ని అందుకోవడం ఆనందంగా ఉంది అని తెలిపారు.

 

కొత్తదనంతో కూడిన సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించడం వల్లే వినూత్నమైన సినిమాలు వస్తున్నాయని, తన పాత్రకు మంచి స్పందన లభిస్తున్నదని ప్రియదర్శి పేర్కొన్నారు. నివేథా థామస్ మాట్లాడుతూ మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. సమిష్టి కృషికి దక్కిన విజయం ఇది అని చెప్పింది.

 

ఈ ఏడాది తమకు నచ్చిన సినిమా ఇదేనని చాలా మంది చెబుతున్నారు. కథలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెరపై ఆవిష్కరిస్తుంటారు వివేక్. తన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని తరుణ్ భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యదేవ్, వివేక్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: