యాంగ్రీ హీరో రాజశేఖర్ కెరీర్ కి ‘గరుడవేగ’ ఊహించని టర్నింగ్ పాయింట్ ఇవ్వడంతో ఈహీరో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు అని అందరు భావించారు. ఎన్ ఎస్ జీ కమెండోగా రాజశేఖర్ నటన ‘గరుడవేగా’ కు హైలెట్ గా మారింది. దీనికితోడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు టేకింగ్ కూడ ఆసినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్ళింది.
దీనితో ఆ హిట్ ట్రాక్ ను కొనసాగించాలని రాజశేఖర్ మరోసారి వైవిధ్యం ఉన్న కథను ఎంపిక చేసుకుని `అ` ఫేం ప్రశాంత్ వర్మతో చేసిన కల్కి ప్రయోగం వికటించింది. ఈసినిమాకి క్రిటిక్స్ నుంచి మంచి విమర్శలు వచ్చినా కలక్షన్స్ పరంగా నిలదొక్కుకోలేక పోతుంది. ఈ సినిమాలో రాజశేఖర్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి కాని అతడు కోరుకున్న హిట్ ను అందుకోలేక పోయాడు.
ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ ఈమూవీని ప్రమోట్ చేస్తూ రాజశేఖర్ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థ ప్రతినిధి రాజశేఖర్ ను ఈసినిమా తర్వాత ఏయే ప్రాజెక్టులు చేయబోతున్నారు ? కుమార్తెలు శివానీ శివాత్మికలతో కలిసి సినిమాచేసే ఆలోచన ఉందా? అని అడిగిన ప్రశ్నలకు రాజసేఖర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.
తన పెద్ద కూతురు శివాని సినిమా మొదలై అనుకోని కారణాలతో ఆగిపోయిది అని చెపుతూ నిజానికి శివాత్మిక `దొరసాని` కంటే ముందుగానే శివాని కథానాయికగా నటించిన సినిమా విడుదల అవుతుందని తాను అనుకున్న విషయాలను వివరించాడు. అయితే తన కూతుళ్ళు ఇద్దరూ రెండు మూడు సినిమాలు చేసిన తరువాత తమ కుటుంబం అంత కలిసి నటించే సినిమా చేస్తాం అని చెపుతూ అందులో జీవిత కూడా నటిస్తుంది అన్న విషయాన్ని రాజశేఖర్ బయటపెట్టాడు. అంతేకాదు తన కూతుళ్ళు ఈ మధ్య తనకు ఒక కథ చెప్పిన విషయాన్ని బయట పెడుతూ ఆ కథకు సంబంధించిన సినిమా ఒక ప్రముఖ నిర్మాత నిర్మించే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ చేసాడు..