షూటింగ్‌లో గాయపడిన హీరో నాగశౌర్య పూర్తిగా కోలుకోకుండానే మళ్లీ షూటింగ్ షురూ చేశారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో నాగశౌర్య నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది నాగశౌర్య సొంత బ్యానర్. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన షూటింగ్‌లో ప్రమాదవశాత్తు నాగశౌర్య కాలికి గాయమైంది.

 

అక్కడే వైద్యం చేయించుకన్న నాగశౌర్య హైదరాబాద్ వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. వాస్తవానికి నాగశౌర్య మోకాలు జాయింట్ వద్ద నరాలు చిట్లాయి. డాక్టర్లు చిన్న సర్జరీ కూడా చేశారు. పూర్తిగా నయం కావడానికి నెలరోజుల పాటు విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారు. కానీ, నాగశౌర్య మాత్రం తన వల్ల మిగిలిన యూనిట్ సభ్యులకు ఇబ్బంది కలగకూడదని షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

 

కాలికి గాయం అయిన తరవాత నాగశౌర్య తొలిసారి ‘ఓ బేబీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. తాను న‌టించిన చిత్రం కావ‌టంతో ఈ కార్యక్రమానికి హాజ‌రుకావ‌టం త‌న ధ‌ర్మం అని భావించి నాగ‌శౌర్య వెళ్లారు. ఇప్పడు కూడా తన సినిమాలోని నటీనటుల తేదీల సర్దుబాటు స‌మ‌స్య కాకూడ‌దు అని భావించి షూటింగ్‌కి హాజ‌ర‌య్యారు. గురువారం నుంచి హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేట ప్రాంతంలో షూటింగ్ మొద‌లుపెట్టారు.

 

‘ఛ‌లో’, ‘నర్తనశాల’ త‌రువాత నాగ‌శౌర్య, ఐరా క్రియేషన్స్ బ్యాన‌ర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగ‌శౌర్యకి జంట‌గా మెహ్రీన్ నటిస్తోంది. పోసాని కృష్ణముర‌ళి, స‌త్య, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్కర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తు్న్నారు. మనోజ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి నిర్మాత.


మరింత సమాచారం తెలుసుకోండి: