పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. 2016 సంవత్సరంలో వచ్చిన నేను శైలజ తరువాత రామ్ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.రామ్ నటించిన హైపర్, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. హలో గురు ప్రేమ కోసమే యావరేజ్ అనిపించుకున్నప్పటికీ ఆ సినిమా వలన రామ్ కెరీర్ కు పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఇప్పటికిప్పుడు రామ్ కెరీర్ కు బ్లాక్ బస్టర్ చాలా అవసరం.

 

దర్శకుడు పూరీ జగన్నాథ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా వరుస విజయాలు అందుకున్న పూరి జగన్నాథ్ టెంపర్ తరువాత హిట్టు కొట్టలేదు. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్, పైసా వసూల్, మెహబూబా ఇలా వరుస ఫ్లాపు సినిమాలు తీసాడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్టు కొట్టాల్సిన అవసరం ప్రస్తుతం రామ్ కంటే పూరీ జగన్నాథ్ కే ఎక్కువగా ఉంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్, పూరీ జగన్నాథ్ కెరీర్లకు ఈ సినిమా హిట్టవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది.

 

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. పూరి మార్క్ హీరోయిజంతో రామ్ ఈ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. రామ్ సరసన నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేశ్, సవ్యసాచి ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 18న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా పూరీ జగన్నాథ్, నటి చార్మీ కౌర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.మరి ఫ్లాపుల్లో ఉన్న రామ్ , పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: