సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కినచిత్రం ` ఓ బేబీ`. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మాతలు. జూలై 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మ్యాజికల్ బ్లాక్ బస్టర్ గా అటు ప్రేక్షకుల, ఇటు సినీ వర్గాల ప్రముఖుల ప్రశంసలు పొందుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం (జూలై 7 )న రామానాయుడు స్టూడియోలో థాంక్స్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో రానా దగ్గుపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈసందర్భంగా...
లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ - ``సినిమా ప్రారంభమైన తర్వాత సురేశ్బాబుగారికి సినిమా నచ్చలేదంటే ఆపేసేమనేవారు. ఇదేంటి? ఇయన ఇలా మాట్లాడుతున్నారని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు తెలిసింది. ఆయనకు నచ్చకపోతే అస్సలు ఒప్పుకోరు. అలా ఉండబట్టే ఇంకా మంచి సినిమాలు చేయగలుగుతున్నారు`` అన్నారు.
డైరెక్టర్ నందినీ రెడ్డి - ``థియేటర్కు సినిమా చూడటానికి వెళ్లగానే ప్రేక్షకులు నన్ను చూసి పట్టుకుని ఏడ్చేస్తున్నారు. మా అమ్మగారు కనపడ్డారు.. నాన్నమ్మ, అమ్మమ్మ కనపడింది అంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఆ సందర్భంలో నేనెలా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదు. మాటలు రావడం లేదు. ఆడియన్స్కు హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి ఎక్స్పీరియెన్స్ జీవితంలో ఎప్పుడో కానీ రాదు. మా జన్మకు గ్రేటెస్ట్ ఎక్స్పీరియెన్స్. సినిమా చూసి మేం ఏదైతే ఫీల్ అయ్యామో.. దానికి పది రెట్లను ప్రేక్షకుల్లో చూశాం. ఇలాంటి సంతృప్తి మరెక్కడా రాదేమో. ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవుడుకి కృతజ్ఞతలు. నన్ను, సమంతను, సునీతాను విధే కలిపిందని నమ్ముతున్నాను. ఓరిజినల్ కథను రాసిన కొరియన్ రచయితలకు థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. అందరూ కనెక్ట్ అయ్యి ఈ సినిమాను చేశాం. ఆ ఎక్స్పీరియన్స్ మాకు చాలా కొత్తగా ఉంది`` అన్నారు.
సమంత అక్కినేని మాట్లాడుతూ - ``నా పని పూర్తయ్యింది. నేను చెప్పడానికి ఏమీ లేదు. మీడియాకు కృతజ్ఞతలు. మొదటి నుండే పాజిటివ్ రిపోర్ట్స్ రావడం ప్రారంభమయ్యాయి. అది చూడగానే ఏడ్చేశాను. మీడియా, క్రిటిక్స్ సైడ్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఈ ఎఫెక్ట్ రెండు రోజులుంటుంది. మళ్లీ మంచి స్రిప్ట్, పెర్ఫామెన్స్ కోసం వెతుక్కుంటాను. అయితే మా బేబీ చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ప్రతి రోజూ హ్యాపీగా చేశాను. ఫలితం కూడా చాలా హ్యాపీనిచ్చింది. ఇది నాకు గ్రేటెస్ట్ గిఫ్ట్. ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ - ``సంవత్సరంలోనే మూడు సినిమాలు చేయాలని మా నాన్నగారి కోరిక అయితే.. నాకు అంత లేదు. ఒక సినిమానే చేస్తుంటాను. ఇక సమంత పిచ్చకి ఓ అడ్రస్ దొరికేసింది. తను ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు చేసుకోవచ్చు. సునీత తాటి, నందినీ రెడ్డి, సమంత అందరూ సురేశ్ ప్రొడక్షన్ అనే గొడుకు క్రిందకి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మహిళలు సినిమా. వాళ్లే రూపొందించారు. వాళ్ల గురించిన సినిమా.. వాళ్ల ఎమోషన్స్ ఉంటాయి. ఇలాంటి ఓ స్పెషల్ మూవీని కొరియన్ నుండి అడాప్ట్ చేసి రాసి, డైరెక్ట్ చేసిన నందినీకి హ్యాట్సాఫ్.నేను, సమంత పదేళ్ల క్రితం ఒకేసారి కెరీర్ను స్టార్ట్ చేశాం. ఇలాంటి కథలు పదేళ్ల క్రితం పెద్దగా వచ్చేవీ కావు. వస్తే.. అన్ని సమకూరేవిగా కావు. కానీ ఇప్పుడు ఇలాంటి సినిమాలే మెయిన్ సినిమాలవుతున్నాయి. కంటెంట్ సినిమాలకు ఆదరణ పెరుగుతున్నాయి. ప్రేక్షకులకు థాంక్స్.