తమిళ స్టార్ హీరో సూర్య వరుస చిత్రాలకు కమిట్ అవుతున్నాడు. అందులో భాగంగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య 'ఎన్జీకే' చిత్రంలో నటించగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని చవిచూసింది. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈచిత్రం తెలుగులో అయితే దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ సినిమా తరువాత సూర్య ,రంగం ఫేమ్ కేవీ ఆనంద్ డైరెక్షన్ లో కాప్పాన్ అనే సినిమా ను పూర్తి చేశాడు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో సయేశా సైగల్ కథానాయికగా నటించగా మోహన్ లాల్ , ఆర్య , బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగులో 'బందోబస్త్' పేరుతో డబ్ అవుతుంది. సెప్టెంబర్ 20న ఈచిత్రం తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది. కాగా ఈసినిమాలో సూర్య కమాండర్ గా కనిపించనున్నాడు.
ఇక సూర్య ప్రస్తుతం 'సురరై పోట్రు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. గురు ఫేమ్ సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూర్య కు జోడిగా అపర్ణ బాలమురళి నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాలే కాకుండా సూర్య తాజాగా మరో చిత్రానికి కమిట్ అయ్యాడు. తనకు 'సింగం' సిరీస్ రూపంలో బ్లాక్ బ్లాస్టర్ హిట్లు ఇచ్చిన హరి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సూర్య. అంతేకాదు ఈ సినిమాను తన సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా సింగం సిరీస్ కు సీక్వెల్ కాదట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది.