అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన భామ జాన్వీ కపూర్‌. అచ్చం త‌ల్లి శ్రీదేవి పోలిక‌ల‌ను పుణికి పుచ్చుకున్న జాన్వీకి అప్పుడే విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్ప‌డింది.  తొలి సినిమా ధడక్‌తోనే నటిగా మంచి మార్కులు సాధించిన ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్‌కు పరిచయం కానుందన్న టాక్‌ వినిపిస్తోంది. అందాల శ్రీదేవి దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ హీరోయిన్ అయినా ఆమెను టాప్ హీరోయిన్‌ను చేసిన ఘ‌న‌త మాత్రం మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌దే.


తెలుగులో వ‌చ్చిన స్టార్ ఇమేజ్‌తోనే శ్రీదేవి చివ‌ర‌కు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత ఏకంగా ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ దేవ‌త‌గా మారిపోయింది. ఇక ఇప్పుడ శ్రీదేవి కుమార్తె జాన్వీని టాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసుకున్నారట. ఆరు వ‌రుస ప్లాపుల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్‌ హిట్ అందుకున్న పూరి, తదుపరి చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కించనున్నాడు. 


ఈ సినిమాపై నిర్మాత ఛార్మీ ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చేసింది. ఛార్మీ, పూరి క‌లిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఏకంగా డ‌బుల్ లాభాల‌ను క‌ళ్ల చూసిన ఛార్మీ, పూరి ఇద్ద‌రు మాంచి జోష్‌లో వ‌రుస పెట్టి సినిమాలు చేయాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేసే సినిమాకు ముందే క్రేజ్ తీసుకు వ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ఈ సినిమాలోనే జాన్వీ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. గతంలో జాన్వీ, సౌత్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ అంటే తనకు ఇష్టమని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో విజయ్‌తో నటించేందుకు జాన్వీ ఓకె చెప్పే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై పూరి టీం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా జాన్వీ టాలీవుడ్‌ ఎంట్రీపై సౌత్‌ లో గట్టిగానే చర్చ జరుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: