మంచిగానో చెడుగానో.. సుజీత్ అనే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న మాట వాస్తవం. సినీ పరిశ్రమలో ఎవరి దగ్గరా అసిస్టెంటుగా పని చేయకుండానే.. షార్ట్ ఫిలిమ్స్ అనుభవంతో దర్శకుడిగా అవకాశం అందుకుని.. 'రన్ రాజా రన్' అనే చిన్న సినిమాతో పరిచయం అయి.. ఆ సినిమాతో మెప్పించి ఏకంగా ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమా తీసే అవకాశం పట్టేసి.. రూ.350 కోట్ల భారీ బడ్జెట్లో 'సాహో'ను తీర్చిదిద్దిన దర్శకుడతను.
అద్భుతాలు చేసిన సుజీత్.. ఈసారి ప్రభాస్ లాంటి హీరో, భారీ బడ్జెట్, ఇంకా ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నా ఆశించిన ఔట్ పుట్ ఇవ్వలేకపోయాడు. 'సాహో' భారాన్ని అతను మోయలేకపోయాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్తో ప్రస్తుతానికి బండి బాగానే లాగిస్తోంది. వీకెండ్ తర్వాాత ఏమవుతుందో చూడాలి.
'సాహో' సినిమాకు చాలా విమర్శలు ఎదుర్కొన్న సుజీత్.. తర్వాత ఏం సినిమా తీస్తాడన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ విషయమై సుజీత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. ఈసారి తాను 'సాహో' లాంటి భారీ చిత్రం చేయబోనని సుజీత్ తేల్చి చెప్పాడు.
మగధీర' లాంటి భారీ చిత్రం తర్వాత రాజమౌళి.. దానికి భిన్నంగా 'మర్యాదరామన్న' లాంటి చిన్న చిత్రం చేశాడని.. అలాగే తాను కూడా తక్కువ బడ్జెట్లో ఓ చిన్న సినిమా చేయడానికి ప్రయత్నిస్తానని సుజీత్ చెప్పాడు. ఐతే తన తర్వాతి సినిమా ఇంకా ఏదీ ఖరారు కాలేదన్నాడు. ఇంకా దాని గురించి ఆలోచించే స్థితిలో కూడా తాను లేనని సుజీత్ చెప్పాడు.
'సాహో' హడావుడి తగ్గాక తర్వాతి సినిమా స్క్రిప్టుపై దృష్టిపెడతానన్నాడు. ఐతే 'సాహో' అంతటి భారీ బడ్జెట్ సినిమాను, ప్రభాస్ లాంటి హీరోను డీల్ చేశాక మరీ చిన్న సినిమా చేయడానికి సుజీత్ నిజంగా సిద్ధమవుతాడా అన్నది సందేహమే.