ఓవర్సీస్ లో తిరుగులేని రికార్డు సృష్టించాడు ప్రభాస్. ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదలైన 3 రోజులకే 2 మిలియన్ మార్క్ అందుకుంది. ప్రభాస్ నటించిన మూడు సినిమాలు వరుసగా ఏకంగా 2 మిలియన్ల క్లబ్లోకి చేరాయి. ఇలా వరుసగా మూడు సినిమాలు ఈ క్లబ్లోకి చేరడం రికార్డే. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో ఇలా వరుసపెట్టి 3 సార్లు 2 మిలియన్ క్లబ్ లోకి వెళ్లలేకపోయాడు.
ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు 2 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. ఇప్పుడీ క్లబ్ లోకి సాహో కూడా చేరింది. సాహోకు ఓవర్సీస్లో కూడా అదిరిపోయే క్రేజ్ ఉంది. బాహుబలి రెండు సినిమాలు సూపర్ బ్లాక్బస్టర్ హిట్ అవ్వడంతో ఆ క్రేజ్ సాహోకు ఎంతైనా ఉపయోగపడింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు గాను సాహో రూ.294 కోట్ల గ్రాస్ వసూళ్లతో నాటౌట్గా దూసుకుపోతోంది.
ఇక సోమవారం కూడా సెలవు కావడంతో సాహో వసూళ్లకు వచ్చిన ఇబ్బందేమి ఉండదు. మంగళవారం నుంచి సాహోకు అసలు పరీక్ష ఎదురు కానుంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు 20 లక్షల 80వేల 694 డాలర్ల మొత్తం వచ్చింది. సోమవారం నాటి వసూళ్లు కూడా భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే ఓవర్సీస్లో సాహోను రూ.43 కోట్లకు అమ్మారు. ఇప్పటి వరు రెండు మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసినా మరో ఐదు మిలియన్ డాలర్ల వరకు రాబట్టడం సాధారణమైన విషయం కాదు.
ఉత్తరాదిలో కూడా సాహో ప్రభంజనం కొనసాగుతోంది. 3 రోజుల్లో ఈ సినిమాకు 79 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. తాజా వసూళ్లతో ఇది కబీర్ సింగ్, భారత్, మిషన్ మంగళ్ సినిమాల్ని అధిగమించింది. ఇటు నైజాంలో కూడా సాహో డ్రీమ్ రన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో బాహుబలి-2 రికార్డును బీట్ చేసింది సాహో.