ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు తీయడం మేకర్స్ కు సవాలు గా మారింది. కథ దొరకనో లేక బడ్జెట్ లేకనో కాదు సినిమా తీస్తే దాని వల్ల ఎవరి మనోభావాలు దెబ్బ తింటాయోనని భయపడుతున్నారు. కథ దగ్గరనుండి టైటిల్ , పోస్టర్ల వరకు ఏ ఒక్క విషయంలో అజాగ్రత్తగావున్నా.. మనోభావాలు దెబ్బ తిన్నాయని రచ్చ చేయడానికి ఓ వర్గం రెడీ గా ఉంటుంది. షూటింగ్ లను ఆపడం అంతటితో ఆగకుండా కేసువేసి చిత్ర యూనిట్ ను కోర్టులు చుట్టూ తిప్పించడం ఇటీవల కొందరు ఇదే పనిగా పెట్టుకున్నారు. వీరి దెబ్బకు ఆసినిమా మేకర్స్ కూడా దిగి రాక తప్పడం లేదు.
వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమానే ఇందుకో ఓ మంచి ఉదాహరణ. సినిమా విడుదలయ్యే 6గంటల ముందు కేవలం మనోభావాలు దెబ్బతిన్నాయనే కారణంగా వాల్మీకి గా వున్న టైటిల్ ను గద్దల కొండ గణేష్గా మార్చి సినిమా ను విడుదలచేయాల్సి వచ్చింది.
ఇక తాజాగా తమిళ హీరో కార్తి నటిస్తున్న సుల్తాన్ అనే సినిమా కు కూడా ఈ దెబ్బ తప్పలేదు. కేవలం సుల్తాన్ అనే పేరు పెట్టినందుకు శివసేన పార్టీ కార్యకర్తలు , దుండిగల్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కు వచ్చి షూటింగ్ ను ఆపేసారు. అయితే చిత్ర నిర్మాతలు టిప్పు సుల్తాన్ జీవిత కథ కు ఈ కథ కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇస్తూ తాజాగా ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. కేవలం ఓటైటిల్ ను చూసి ఓ అంచనాకు వచ్చి ఇలా సినిమా షూటింగ్ ను ఆపేయడం కరెక్ట్ కాదని ఈసందర్భంగా నిర్మాతలు వాపోయారు. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.