సాహో విడుదలకు ముందు ఆ చిత్రం గురించి హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఎంత గొప్పగా చెప్పిందో అందరికి తెలిసిందే. ప్రభాస్ తో కలిసి పని చేయడం గురించి ఇంత పెద్ద సినిమాలో భాగం కావడం గురించి చాలా ఎగ్జైట్ అయింది. ప్రమోషన్లలో కూడా హుషారుగా పాల్గొంది. కానీ రిలీజ్ తర్వాత ఆమె అడ్రస్ ఎక్కడ కనపడలేదు. ఎక్కడా సాహో గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు శ్రద్ధ కపూర్. తాజాగా ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సాహో గురించి విలేకరులు ప్రశ్నలు అడిగితే ఆమె స్పందించిన తీరు చాలా విరుద్దంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

అసలు విషయానికి వస్తే ఈ కార్యక్రమంలో ఎదురుగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు కూర్చుని ఉండగా వేదిక మీద హోస్ట్ సాహో సినిమాలో నటించడంలో మీ అనుభవం చెప్పండి అని హోస్ట్ అడిగాడు. దానికి ఆమె బదులివ్వకుండా ఆడియన్స్ వైపు చూసి వాళ్లను పలకరించింది. కానీ అక్కడ విచిత్రంగా వాళ్లు నాతో డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు అంటూ సంబంధం లేకుండా మాట్లాడింది.

 తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన హోస్ట్ సాహో గురించి చెప్పండి అని మళ్లీ అడిగాడు. మళ్లీ ఆమె ప్రేక్షకుల వైపు చూసింది. వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. ఎవరో ఐలవ్యూ అంటే లవ్యూ టూ అని బదులు కూడా ఇచ్చింది. హోస్ట్ మళ్లీ గ్యాప్ ఇచ్చి సాహో గురించి చెప్పమన్నాడు. సాహో? అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టిన శ్రద్ధ ఆడియన్స్ వైపు చూస్తూ మీరంతా చిచ్చోరే సినిమా చూశారా అని అడగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

సాహో సినిమా అంచనాలు అందుకోకపోయినా ముందు అంతగా గొప్పగా చెప్పుకున్న చిత్రం గురించి ఇప్పుడు రెండు ముక్కలు మాట్లాడటానికి శ్రద్ధకు అంత బాధేంటో? అని ప్రజలు గుసగుసలాడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: