చట్టాన్నే బోల్తా కొట్టించాలని స్కెచ్చేసిన ఓ భారతీయుడు..ఆ ప్రయత్నం ఫలితం ఇవ్వకపోవడంతో....చెరసాలకు చేరుకున్నాడు. ఓ యువతిపై అత్యాచారం చేసి.. లండన్ నుంచి పారిపోయి.. భారత్కు వచ్చేస్తే చాలు అనుకున్న ఆ కామపిశాచికి ఎట్టకేలకు బేడీలు పడ్డాయి. రేప్ కేసులో దోషిగా తేలిన న్యాయస్థానం ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. దీంతో జైల్లో మగ్గే పరిస్థితి ఎదురైంది.
వివరాల్లోకి వెళితే...అజయ్ రానా(35) అనే యువకుడు తూర్పు లండన్లోని సఫోల్క్ ప్రాంతంలో 9 డిసెంబర్, 2017న స్నేహితుడి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఓ మహిళ(30)కు లిఫ్ట్ ఆఫర్ చేశాడు. వాతావరణం చాలా చల్లగా ఉండటం.. అతడు అప్పటికే మరో ఇద్దరికి లిఫ్ట్ ఇవ్వడంతో మహిళ అంగీకరించి కారు ఎక్కింది. కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత కారు ప్రక్కగా ఆపి మహిళపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని సమీపంలోనే ఉన్న స్నేహితుల ఇంటికి వెళ్లి మహిళ జరిగిన విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు.
అయితే, సరైన ఆధారాలు లేకపోవడంతో...దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కేసు పెద్ద మిస్టరీగా పరిగణించింది. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో...మహిళను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. కారు ప్రయాణించిన మార్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి నిందితుడి గురించి వివరాలు అడిగారు. ఆ మార్గంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు మొత్తంమీద కారును గుర్తించారు. కారు యజమాని ఇంటికి వెళ్లి ప్రశ్నించగా నిందితుడు ఇతడి రూమ్ మేట్గా తేలింది. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి మూడు రోజులక్రితమే ఇండియాకు వెళ్లినట్లు చెప్పాడు. ఆ గదిలో నిందితుడు వాడే ఇయర్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.బాధితురాలి వైద్య రిపోర్టులు.. నిందితుడి డీఎన్ఏ రిపోర్టులు సరిపోలాయి. యూకే పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
కేసును యూకే పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకొని దర్యాప్తు కొనసాగించారు. అజయ్ రానా గత ఏడాది అక్టోబర్లో స్పెయిన్కు వెళ్లగా స్పానిష్ పోలీసులు అతడిని నిర్బంధించారు. యూరోపియన్ అరెస్ట్ వారెంట్పై నిర్బంధంలోకి తీసుకుని నవంబర్లో యూకేకు తరలించారు. విచారణలో అజయ్ రానా దోషిగా తేలడంతో కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. క్షణికావేశం కటకటాల పాలు చేసింది.