తమిళనాడు జల్లికట్టు పోరు తరహాలో ఆంధ్రాలోనూ ప్రత్యేక హోదా ఉద్యమం జోరందుకుంటున్న సమయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ స్వయంగా అందులో పాల్గొంటానని ప్రకటించడం ఊపు తెస్తోంది. పెట్టుబడులు రావాలన్నా..అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నీ అన్ని రకాల రాయితీలు కల్పించే ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరమని వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 32 సార్లు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశామని జగన్ ప్రకటించారు.
హోదాను కాంక్షిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్న కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతులు ఇవ్వకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై జగన్ ఫైర్ అయ్యారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను నెరవేర్చుకోడానికి సీఎం హోదాలో చంద్రబాబునే ఇతర పార్టీలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉందన్నారు. అది చేయకపోగా ప్రతిపక్షంగా ప్రజాప్రయోజనాలు కోసం తాము చేస్తున్న పోరాటాలను అడ్డుకుంటున్నారన్నారు జగన్.
హోదా కోసం చేస్తున్న పోరాటాల్లో, ఉద్యమాల్లో పాల్గొంటున్న యువతపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని చంద్రబాబు భయపెడుతున్నాడని ఆరోపించారు. ఏమి తప్పు చేశారని వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తారని నిలదీశారు. జల్లికట్టు ఒక ఆట దాని కోసం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ శెల్వం ఇతర పార్టీలను కలగలుపుకొని ముందుకెళ్లి సాధించుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జల్లికట్టును స్పూర్తిగా తీసుకొని హోదా కోసం పోటం చేయాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలంతా నిరసన వ్యక్తం చేస్తారని..ఆ తరువాత జరిగే సమావేశాలను అడ్డుకుంటారని తెలిపారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని కాకుంటే..ఎంపీలంతా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లదామని సూచించారు. ఎవరు సహకరించినా..సహకరించకపోయినా ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.