గత కొన్ని రోజులుగు హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని కొంత మంది అక్రమార్కులు డ్రగ్స్ దందా చేస్తున్న విషయం ఈ మద్య పట్టుబడిన డ్రగ్స్ ముఠాద్వారా తెట తెల్లం అయ్యింది. ముఖ్యంగా కొన్ని పబ్ లను ఈ దందాకు కేంద్రంగా చేసుకొని యువత నుంచి అడ్డగోలు డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతే కాదు స్కూల్ విద్యార్థుల నుంచి ఐటీ ఉద్యోగులు, సెలబ్రెటీస్, సినీ పరిశ్రమకు చెందిన వారికి ఈ డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు నేరస్థులు పోలీసుల ఇంటరాగేషన్ లో తెలిపారు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేసులో ఎంత పెద్ద వారు ఉన్నా..చివరకు తమ అధికార పార్టీ వారైనా ఎవ్వరినీ వదలవొద్దని పోలీసులకు సీరియస్ ఆర్డర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో హైదరాబాద్ పోలీసులు పబ్ యాజమాన్యాలకు భారీ షాక్ ఇచ్చారు. ఇంతకాలం అర్థరాత్రి ఒంటి గంట వరకూ అధికారికంగానూ.. అనధికారికంగా తెల్లవారుజామున మూడు.. నాలుగు గంటల వరకూ సాగిన పబ్బులకు ఇప్పుడు కళ్లేం వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.
అంతే కాదు తమ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లు.. పబ్ లు.. హోటళ్లు మూసివేసిన తర్వాతే సెక్టార్ ఎస్ ఐలు ఇంటికి వెళ్లాలంటూ తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అర్థరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు పబ్ లు మూసివేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక.. రాత్రి 12 గంటల తర్వాత పబ్బుల దగ్గర అనుమానాస్పదంగా కార్లు.. వ్యక్తులు తిరిగితే ప్రశ్నించాలని స్పష్టం చేయటం గమనార్హం. మరి.. ఈ ఆదేశాలు ఎంత పక్కాగా ఎన్ని రోజులు సాగుతాయో చూడాలి.