పాలిటిక్స్లో లాభాలు లేకుండా ఏ పనీ జరగదు! బంధాలు, బంధుత్వాలకన్నా కూడా.. నాకేంటి? అనే లానే పాలిటిక్స్ పరుగులు పెట్టిస్తాయి. ఇప్పుడు ఇలాంటి ఆలోచనే టీడీపీ అధినేత చంద్రబాబును పరుగులు పెట్టిస్తోంది. తనకు లాభం లేకుండా ఆయన ఏ ఒక్క అడుగూ ముందుకు వేయని పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా నిన్న టీడీపీలో పదవుల పందేరం జరిగిపోయింది. ఈ క్రమంలో ఇటీవల కావలంలో రాజకీయాలకు దూరంగా ఉన్న నందమూరి హరికృష్ణకు చంద్రబాబు పొలిట్ బ్యూరోలో ఉన్న స్థానాన్ని అలాగే ఉంచారు. దీంతో నందమూరి అభిమానులు ఖుషీ అయ్యారు.
అయితే, వాస్తవానికి ఇలా హరికృష్ణకు పదవిని కట్టబెట్టడం వెనుక బాబు పెద్ద ప్లాన్ వేశారని అంటున్నారు. బాబు వచ్చే ఎన్నికలు సహా మరో 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉండాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పదే పదే చెపుతున్నారు. దీనికిగాను ఆయన అన్ని వర్గాలను బుజ్జగిస్తున్నారు. అయినా కూడా ప్రజల్లో ఏదో తెలియని వ్యతిరేకత అయితే లైట్గా బాబుకు తెలుస్తోంది. దీనికితోడు 2014లో తనకు మద్దతిచ్చిన పవన్ ఇప్పుడు పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు. అదేసమయంలో కేడర్ని కూడా రెడీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా వెళ్తానని చెప్పారు.
ఇంత జరుగుతుంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పవన్ పోటీ కాకుండా మిత్రుడు ఎలా అవుతాడని బాబు భావిస్తున్నారు. ఒకవేళ మిత్ర పక్షంగానే ఉన్నా.. ఎక్కువ ఓట్లు, సీట్లు పవన్ కొట్టేస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా బాబును కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పవన్పై పూర్తి విశ్వాసంగా లేరు. కాబట్టి తనకు అన్ని విధాలా మేలు చేసే సొంత మనిషి ఉంటే బాగుంటుందని బాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2009లో తనకు అక్కరకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ను మరోసారి అవసరానికి వాడుకోవాలని బాబు ప్లాన్లో ఉన్నారు.
అయితే, ఎన్టీఆర్తో నేరుగా కన్నా.. మరో మార్గంలో వెళ్తేనే పని అవుతుందని భావించిన చంద్రబాబు.. దీనికి పావుగా తన బావమరిది హరికృష్ణను వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు పార్టీ పొలిట్ బ్యూరో పదవిని అడగకుండానే కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే జూనియర్తో ప్రచారం చేయించుకునే వ్యూహంలో బాబు ఉన్నారని అంటున్నారు టీడీపీ నేతలు. మరి ఏదేమైనా బాబు ముందస్తు వ్యూహంతోనే పదవులు కట్టబెట్టినట్టు స్పష్టం అవుతోంది.