రాజకీయమైనా సినీ రంగమైనా `సెంటిమెంట్` దగ్గర జాగ్రత్తగా ఉండాల్సిందే! ఒక్కసారి ప్రజల్లోకి వెళితే ఎవరైనా భయపడాల్సిందే! ఇప్పుడు ఇదే సెంటిమెంట్ భయం వైసీపీని కలవరపెడుతోందట. టీడీపీ ఎమ్మెల్యే అంటే వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకూ ఈ సెంటిమెంట్ ఆధారంగా ప్రజల్లోకి వెళిపోతూ.. వాళ్లకి దగ్గర అయిపోతుంటే.. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. అంతేగాక దీనిపై ఏదైనా మాట్లాడాలన్నా.. అది తమకు రివర్స్ అయిపోతుందని, ప్రజల్లో తమపై వ్యతిరేకత తీవ్రమవుతుందని సైలెంట్గా ఉండటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట. ఆ ఎమ్మెల్యేకి ఎలా చెక్ చెప్పాలో తెలియక సతమతమవుతున్నారట!
2014లో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే! రాష్ట్ర విభజన సమయంలో.. ఆయన సిద్ధాంతం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని టీడీపీ నేతలంతా ఆయన్ను నిరాశపరిచారట. కానీ ఒకే ఒక్కరు యరపతినేని శ్రీనివాసరావు మాత్రం.. పాదయాత్ర చేయాల్సిందేనని, అది కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని పట్టుబట్టారు. ఈ పాదయాత్ర ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే! టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యేందుకు ఎంతో సహాయపడింది. అప్పటినుంచి యరపతినేని శ్రీనివాసరావుపై టీడీపీ అధినేతకు చాలా నమ్మకం కుదిరింది.
ఇక తర్వాత మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ యరపతినేని పేరు బలంగా వినిపించింది. కానీ అప్పటి సమీకరణాల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పదవి ఆశించి రాని వాళ్లంతా నిరుత్సాహానికి గురై.. అలకబూని ఆగ్రహం వ్యక్తం చేస్తే.. యరపతినేని మాత్రం బాబుకి ఉన్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని.. పదవి రాకపోయినా ఒక్క మాట మాట్లాడలేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అభిమానం చూరగొన్న.. ఆయన గురజాల నియోజకవర్గ అభివృద్ధికి దాన్ని వాడుకుంటున్నారు. దీంతో ఇక్కడ ప్రతిపక్ష వైసీపీ కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అంచనా వేసే జగన్ పల్నాడులో గట్టి పేరున్న కాసు కుటుంబ వారసుడు మహేష్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
నరసరావుపేట నుంచి నాయకుడు వచ్చినా గురజాలలో వైసీపీ కి అదనంగా కలిగిన ప్రయోజనం ఏమీ లేదు. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే యరపతినేని కొత్త కొత్త ఆలోచనలు, అస్త్రాలు. తాజాగా ఆయన సంధిస్తున్న సెంటిమెంట్ అస్త్రాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక కాసు మహేష్ రెడ్డి తలలు బద్దలు కొట్టుకుంటున్నారట. 60 ఏళ్ళు నిండిన వాళ్లకి షష్టిపూర్తి, గర్భిణికి శ్రీమంతం వంటివి ఆయా కుటుంబాలు చేసుకునే వ్యవహారాలు. ఆర్ధిక స్థోమత లేని కుటుంబాల్లో ఇలాంటి ఫంక్షన్స్ కి తావు ఉండదు. అయితే యరపతినేని తన సొంత డబ్బులతో నియోజకవర్గం అంతటా ఈ కార్యక్రమాల్ని సామూహికంగా నిర్వహిస్తున్నారు.
సంతానం కూడా పట్టించుకోని వృద్ధులు తనకి జరిగిన గౌరవాన్ని తలచుకుని మనసారా ఎమ్మెల్యేని ఆశీర్వదిస్తున్నారు. ఇక నిండు గర్భిణీలు కూడా తమ శ్రీమంతం జరిపిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో గురజాలలో సాగుతున్న ఈ సెంటిమెంట్ రాజకీయం మీద కనీసం విమర్శ చేయడానికి కూడా భయపడుతున్నారు. మరి ఇంతలా ప్రతిపక్షాన్ని భయపెట్టేస్తున్న ఆయనకు ఇక ఎదురులేదనేది స్పష్టమవుతోంది!!