తన నిర్ణయాలతో ఇప్పటికే అందరికీ షాకులు ఇస్తున్న ప్రతిపక్ష నేత జగన్.. మరోసారి ఇదే పంథా ఫాలో అవుతున్నారు. పాదయాత్ర సమయంలో.. నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ఆయన నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ ఫిరాయించిన నేతలపై వేటు వేసే వరకూ అసెంబ్లీకి రాబోమని చెప్పినా.. అది కేవలం సాకు మాత్రమే అని తేలిపోయిందనేది విశ్లేషకుల అభిప్రాయం! అతి ముఖ్యులను తప్ప మిగిలిన వారిని జగన్ నమ్మరనే విషయం తెలిసిందే! ఇప్పుడు కూడా ఎమ్మెల్యేల మీద నమ్మకం లేని ఆయన.. ఇలా సమావేశాలు బహిష్కరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష నేత జగన్ `ప్రజా సంకల్ప యాత్ర` పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. అక్రమాస్తు లకేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నా.. పాదయాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాదయాత్ర సమయంలో.. ఇతర ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేసేశారు. అయితే ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండటంతో.. సభ్యులతో చర్చించి వాటిని బహిష్కరించాలని నిర్ణయించారు. జగన్ యాత్ర నిర్వహిస్తున్నారని తెలిసే, సమయం చూసుకుని అసెంబ్లీ సమావేశాలను అధికార పార్టీ ఏర్పాటు చేసిందంటూ పలువురు వైకాపా నేతలు విమర్శించారు.
అసెంబ్లీని ఎదుర్కొనేందుకు ధైర్యం లేకనే కుంటి సాకులు చెబుతున్నారంటూ టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేతలు దాడి మొదలుపెట్టేశారు. రాష్ట్రంలో అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతూ, ఉపాధి హామీ కూలీల డబ్బులను అడ్డుకునేందుకు కూడా లేఖలు రాశారని, వీటిపై మాట్లాడేందుకు వారి దగ్గర సరైన వాదన లేదని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దుయ్యబడుతున్నారు. డిప్యూటీ నాయకుడి మీద, ఇతర ఎమ్మెల్యేల మీద జగన్ కు నమ్మకం లేదని అందుకే ఇలా బహిష్కరణను తెరపైకి తెచ్చారని విమర్శిస్తున్నారు. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నిలదీయాల్సింది పోయి, కుంటి సాకులతో పారిపోతున్నారనే అపకీర్తి మూటకట్టుకుంటున్నారు. ఇక వైసీపీ వాళ్లు కూడా తమపై జగన్కు నమ్మకం లేదా ? అని పైకి చెప్పకపోయినా లోపల మాత్రం మండిపడుతున్నారు.
ఇప్పటికే తన పాదయాత్రను నాలుగు రోజులు వాయిదా వేసిన ఆయన.. మరో పది రోజులు వాయిదా వేసుకోవడం పెద్ద సమస్యే కాదు. కానీ జగన్ అలా వ్యవహరించకపోవడం విమర్శలకు తావిస్తోంది! పైగా, అసెంబ్లీలో జగన్ ఒక్కరిదే వాయిస్. తర్వాత స్థాయి నాయకులెవ్వరూ పెద్దగా మాట్లాడిన చరిత్ర గత సమావేశాల్లో లేదు. పోనీ, జగన్ లేకుండా పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశాలను నెట్టుకుని రాగలరా అంటే.. ఆ నమ్మకం జగన్ కే ఉన్నట్టు లేదనేది కూడా కొంత వాస్తవమే. జగన్ యాత్రకు బయలుదేరితే నేతలు అందరూ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి, ఎమ్మెల్యేల గైర్హాజరీకి కూడా ఓ పోరాటం కలర్ ఇచ్చే ప్రయత్నం చేశారు!!