కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేయడం టీడీపీ వర్గాల్లోను, ఏపీ రాజకీయాల్లోను ప్రకంపనలు రేపుతోంది. ఏపీ రాజధానికి అనుకుని ఉండే గన్నవరం నుంచి ప్రాథినిత్యం వహిస్తోన్న ఆయన ఇటీవల తరచూ తన సొంత పార్టీ, ప్రభుత్వంపైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందే వంశీ విజయవాడలో పబ్లిక్గా జగన్ను ఆలింగనం చేసుకుని సంచలనం రేపారు. ఆ తర్వాత దీనిపై అధిష్టానం వివరణ కోరడంతో మర్యాద పూర్వకంగానే జగన్ను కలిశానని వివరణ ఇచ్చుకున్నారు.
ఇక ఎమ్మెల్యేగా తరచూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు కార్యకర్తల ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో వంశీ చాల స్ట్రాంగ్ పర్సన్. అందులో సందేహమే లేదు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నిత్యం ఏదో ఒక కార్యక్రమాలను చేస్తూనే ఉంటారు. అయితే ఇటీవల తనను పార్టీలోనే కొందరు టార్గెట్ చేయడం, ప్రభుత్వంలో తన పనులు అవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహానీ ఉందని చెప్పినా ప్రభుత్వం భద్రత పెంచకపోవడంతో వంశీ తన గన్మెన్లను వెనక్కి పంపి తన నిరసన తెలిపాడు. ఇక తన నియోజకవర్గంలో కీలక ప్రాజెక్టు అయిన రామవరప్పాడు వంతెన విషయంలో ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా అధికారులు కొర్రీలు వేస్తుండడం వంశీకి నచ్చలేదు. దీనిపై తాజాగా అసెంబ్లీ సాక్షిగానే ఆయన గళమెత్తారు. ఇక తాజాగా తన నియోజకవర్గం పరిధిలో ఉన్న హనుమాన్జంక్షన్ డెల్టా షుగర్స్ ను తణుకు తరలించేందుకు వంశీ అంగీకరించడం లేదు.
ఈ ఫ్యాక్టరీపై వేలాది మంది రైతులు ఆధారపడి ఉన్నారని, దీనిని తరలించవద్దని ఆయన సూచిస్తున్నారు. బుధవారం కొందరు రైతులతో సహా సీఎంను కలవాలని వంశీ భావించారు. అయితే వంశీని సీఎంవో అధికారులు పట్టించుకోలేదు సరికదా ? దీంతో నీకు సంబంధం లేదని చెప్పడంతో వంశీ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చివరకు కన్నీటి పర్యంతమైన ఆయన తన రాజీనామ లేఖను స్పీకర్కు ఇచ్చేందుకు వెళుతుండగా సహచర ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అడ్డుకుని చించేశారు. ఈ విషయం కాస్త లోకేష్కు తెలియడంతో వంశీతో మాట్లాడే బాధ్యతను ఆయన సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు అప్పగించారు. ఏదేమైనా కొద్ది రోజులుగా వంశీని పార్టీలోనే కావాలనే ఇబ్బంది పెడుతున్నట్టుగా వ్యవహారం నడుస్తోంది.