తెలుగు తెరపై గెస్ట్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన హేమ ఆ తర్వాత కేరెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయిపోయింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ఏరియా అయిన రాజోలు నుంచి వచ్చిన హేమ టాలీవుడ్లోని ఫుల్ బిజీ కేరెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకటిగా ఉన్నారు. బ్రహ్మానందంతో కలిసి ఆమె తెరమీద జంటగా కనిపిస్తే థియేటర్లలో ఎలాంటి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హేమ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది.
గత ఎన్నికల్లో ఆమె మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి ఆమె తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్గా ఉన్న హేమ కాపు ఉద్యమ సమయంలో ఆ కులానికి మద్దతు ప్రకటనలు గుప్పించి రాజకీయ వ్యాఖ్యలు కూడా చేసింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఈ కులంలో కూడా పాపులర్ అయ్యేందుకు ట్రై చేసింది.
ఇక 2019 ఎన్నికల నేపథ్యంలో ఆమె మరోసారి పొలిటికల్ తెరపైకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సారి ఆమె పవర్స్టార్ పవన్కళ్యాణ్ జనసేనలోకి జంప్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఆమె జనసేనలోకి ఎంట్రీ ఇస్తున్నారా ? అన్న సందేహాలకు కారణమయ్యాయి. జనసేన అధినేత పవన్కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
వచ్చే జనవరి తర్వాత పవన్ ఫుల్ టైం పొలిటిషీయన్గా మారనున్నాడు. పవన్ ఏపీలో నాలుగు రోజుల పాటు సుడిగాలి పర్యటనలు కూడా చేశాడు. ఈ పర్యటనలో పవన్ విజయవాడలో మాట్లాడుతూ.. తనకు కులం అంటే పడదని, కుల రాజకీయాలంటే అసహ్యమని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను హేమ పూర్తిగా సమర్ధించారు. పవన్ కాపులకు మద్దతు పలుకుతున్నాడని కొందరు అనుకుంటున్నారని, అదంతా అబద్ధమే అని హేమ ఖండించారు.
తాను కాపు ఉద్యమంలో మెంబర్గా ఉన్నానని, మనకు పవన్ ఉన్నాడుగా అని తాను అంటే కాపు పెద్దలు పవన్ తనది కాపు వర్గం అని చెప్పుకోవడానికే ఇష్టపడడం లేదని చెప్పారు. పవన్కు కులాలు, మతాల పట్టింపులు లేవన్నారు. ఇక ఇటీవల మెగా ఫ్యామిలీతో పాటు పవన్ను కూడా ఆమె ఆకాశానికి ఎత్తేశాలా మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పవన్ జనసేన వైపు హేమ చూస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.