ఏపీ విపక్షం వైసీపీకి చెందిన ఫైర్బ్రాండ్ నేతల్లో ఒకరుగా గుర్తింపు పొందిన కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ఉరఫ్ కొడాలి నాని కేంద్రంగా అధికార టీడీపీ పావులు కదుపుతోంది. 2019లో నానికి బలమైన దెబ్బ కొట్టాలని టీడీపీ ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తోంది. దీనికి గాను ఇద్దరు మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలు రంగంలోకి దిగిపోయారు. నానికి గట్టిగా బుద్ధి చెప్పడంతో రెండు రకాల ప్రయోజనం పొందాలని నేతలు పక్కా స్కెచ్ సిద్ధం చేసినట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది.
విషయంలోకి వెళ్తే.. ఇప్పటికే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నానికి గుడివాడలో మంచి ఫాలోయింగ్ ఉంది. నాని అటు టీడీపీలో ఉన్నా ఇటు వైసీపీలో ఉన్నా కూడా స్థానిక ప్రజలు మాత్రం నానికే జై కొడుతున్నారు. మొదటి నుంచి దూకుడుగా ఉన్న నాని టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. తీవ్ర విమర్శలు గుప్పించాడు.
కొన్ని సందర్భాల్లో తాను ఎమ్మెల్యే అని, చంద్రబాబు సీఎం స్థాయిలో ఉన్నారని కూడా మరిచిపోయి ``వాడు.. వీడు`` అంటూ నోరు పారేసుకున్నారు. అయినా కూడా ఎక్కడా నానికి వ్యతిరేకత రాలేదు. అంతేకాదు, అసలు టీడీపీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు పుట్టిపెరిగిన గుడివాడ ప్రాంతంలో టీడీపీకి బలమైన నేతే కరువయ్యాడు. గతంలో టీడీపీలో ఉండగా నాని స్థానికంగా బలమైన కేడర్ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. అయితే, నాని దూకుడుకు కళ్లెం వేయాలని భావించిన టీడీపీ ఆదిశగా దృష్టి పెట్టింది.
నానిని ఓడించడం ద్వారా రెండు రకాల ప్రయోజనాలను బుట్టలో వేసుకోవాలని భావిస్తోంది. వాటిలో ప్రధానంగా గుడివాడలో టీడీపీ జెండాను తిరిగి ఎగరేయడం, వైసీపీని అడ్రస్ లేకుండా చేసేయడం, రెండు చంద్రబాబుకే సవాలుగా మారిన నేతను మట్టి కరిపించడం. ఈ రెండింటినీ సాధించేందుకుగాను ఈజిల్లాకే చెందిన ఇద్దరు మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాలు ఇప్పటికే రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో గుడివాడ మునిసిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ కు గేలం వేశారు. ఆయన వెంటనే వీరికి చిక్కిపోవడంతోపాటు పార్టీ కండువాను కూడా మార్చేశాడు. బుధవారం వైసీపీకి రాంరాం చెప్పేసి టీడీపీ సైకిల్ ఎక్కేశాడు. నిజానికి రవికాంత్ ... నానికి రైట్ హ్యాండ్గా పేరు తెచ్చుకున్నారు. గతంలో రవికాంత్ అనుచరులు కొందరు టీడీపీ లోకి జంప్ చేసినా.. నాని విజ్ఞప్తితో రవికాంత్ మాత్రం అప్పట్లో పార్టీ మారలేదు. కానీ, మంత్రుల ప్రోద్బలంతో తాజాగా ఆయన కూడా పార్టీ మారిపోయారు.
ఈ సందర్భంగా రవికాంత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు సైతం చేయడం గమనార్హం. నమ్మిన వ్యక్తిని మోసం చేసే నైజం కొడాలి నానిది అని రవికాంత్ అన్నాడు. యలవర్తి మీద దాడి చేయమని కొడాలి నాని చెప్పారని, దళితులు అంటే కొడాలి నానికి చులకన అని, వాడుకుని వదిలేద్దాం అని చాలా సార్లు చెప్పాడని రవికాంత్ పేర్కొనడం గమనార్హం.
ఇక, ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులూ మాట్లాడుతూ.. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎగిరేది తెలుగుదేశం జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, 2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధిస్తుందనడం గమనార్హం. టీడీపీ చేసే అబివృద్ధి కార్యక్రమాల పట్ల రవికాంత్ ఆకర్షితుడయ్యాడని, గుడివాడ సైకిల్ 2019లో అసెంబ్లీకి రాబోతుందని వారన్నారు. మొత్తానికి గుడివాడ ఎమ్మెల్యే నానిపై టీడీపీ పగపట్టినట్టు టార్గెట్ చేయడంత నానికి ఇక కష్టాలు ప్రారంభమైనట్టేనని అంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి.