వచ్చే సాధారణ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వారసుల రాక ఉద్ధృతంగానే ఉండనుంది. ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ అధికార టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన మంత్రులు, సీనియర్ నాయకులు వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు సీట్ల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నాయకులు తమ సిట్టింగ్ సీట్లను త్యాగం చేసి, తాము ఎమ్మెల్సీగా వెళ్లేందుకు రెడీ అవుతుంటే, మరి కొందరు మాత్రం తమకో సీటు, తమ వారసులకో సీటు అన్న చందంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో అధికార పార్టీల్లో మాత్రమే వారసుల హంగామా ఉంటే ఇప్పుడు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోనూ ఈ వారసుల హంగామా స్టార్ట్ అయ్యింది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్లో కొత్త వాళ్ల అవసరమే లేకుండా పోతోంది. ప్రస్తుతం ఉన్న కురు వృద్ధ నాయకులతో పాటు సీనియర్ల వారసులు, వారసురాళ్లే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. తమ వారసుల పొలిటికల్ ఎంట్రీకి సీనియర్ నేతల ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉండడంతో వారు ఎక్కడ నుంచి పోటీ చేయాలా ? అని తర్జన భర్జనల్లో ఉండడంతో పాటు తమకు అనుకూలమైన నియోజకవర్గాలను కూడా చూసుకున్నారు.
మాజీ హోం మంత్రి జానారెడ్డి తన కుమారుడు రఘువీర్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో నాగార్జునా సాగర్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఆయన మిర్యాలగూడ నుంచి, తనయుడు నాగార్జునా సాగర్ నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. మరో సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు నరోత్తమ్ రెడ్డి , మాజీమంత్రి డీకే అరుణ కూతురు స్నిగ్ధ ఇటుగా వచ్చి తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.
ఇక పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలీని వచ్చే ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల విషయానికి వస్తే మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మనుమడు మర్రి శశిధర్రెడ్డి కుమారుడు మర్రి ఆదిత్యా రెడ్డి, మాజీ ఎంపీ ఎం.అంజన్ కుమార్ యాదవ్ కుమా రుడు అనిల్ కుమార్ యాదవ్ , మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్, జహీరాబాద్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి కూతురు మేఘనారెడ్డి పోటీ పడుతున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో టీ కాంగ్రెస్లో కొత్త వారి కంటే వారసులతోనే నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.