వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పెద్దగా జనంలోకి రారు. మొదట్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నా.. ఆమె పార్టీ వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. గత ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయడం, ఓడిపోవడంతో క్రియాశీల రాజకీయాలకు క్రమంగా దూరమయ్యారు. ఎప్పుడో తప్ప ఆమె ప్రజల్లోకి రావడం లేదు. అలాంటి విజయమ్మను ఇటీవల ఓ సీనియర్ పాత్రికేయుడు ఇంటర్వ్యూ చేశారు.
గతంలో వైఎస్ జగన్ గురించి ఏపీ అసెంబ్లీలోనూ విమర్శలు వచ్చాయి. వైఎస్ బతికున్న సమయంలోనూ అసెంబ్లీలో జగన్ గురించి టీడీపీ నేతలు విమర్శలు చేసేవారు. ఆ విమర్శల గురించి విజయమ్మను అడిగారు సదరు సీనియర్ రిపోర్టర్. వైఎస్ జగన్ గురించి.. ఆయన్ను పెంచిన తీరు గురించి.. జగన్ పై విమర్శలు గురించి ప్రశ్నలు అడిగారు.. గతంలో చంద్రబాబు ఓసారి వైఎస్ ను ఉద్దేశించి.. మీ అబ్బాయిని చూడు, మా అబ్బాయిని చూడు ఎలా పెంచానో... అని అసెంబ్లీలో విమర్శించారు కూడా..
ఆ విమర్శలపై స్పందించిన విజయమ్మ.. తన బిడ్డ జగన్ కు ఒక్క దురలవాటు కూడా లేదని స్పష్టం చేశారు. పబ్ లకు వెళ్లి ఎంజాయ్ చేయడం, సిగరెట్లు తాగడం వంటి దురలవాట్లు లేవన్నారు. కనీసం చిన్న అబద్దం కూడా చెప్పడని విజయమ్మ చెప్పారు. జగన్ కు పని చేయడం, అందర్నీ సంతోషంగా ఉంచడం మాత్రమే తెలుసని విజయమ్మ చెప్పుకొచ్చారు. జగన్ వంటి వ్యక్తికి తల్లిగా తాను గర్విస్తానన్నారు.
మరి నారా లోకేశ్ గురించి ఏం చెబుతారు అని అడిగితే.. తాను ఎవరిపైనా విమర్శలు చేయబోనని విజయమ్మ చెప్పారు. కానీ జగన్ గురించి అసెంబ్లీలో దారుణంగా విమర్శిస్తున్నప్పుడు తనకు చాలా బాధ అనిపించేదని.. ఒక్కోసారి కన్నీళ్లు పెట్టుకునేదాన్నని విజయమ్మ తెలిపారు. కానీ జగన్ అలాంటి విమర్శలను ధైర్యంగా ఎదుర్కొన్నారని.. రాజకీయాల్లో అలాంటి విమర్శలు తప్పవని జగన్ తనని సముదాయించాడని విజయమ్మ వివరించారు.