ప్రత్యేక హోదా, అభివృద్ధి చుట్టూతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సుడులు తిరుగుతోన్న ఈ పరిస్థితుల్లో బీజేపీ తనదైన సరికొత్త వ్యూహానికి పదును పెడుతూ నూతన కార్యక్రమానికి తెర తీసింది. పదహారు డిమాండ్లతో "రాయలసీమ డిక్లేరేషన్" పేరిట గురువారం కర్నూల్ లో ఆ పార్టీ కొన్ని తీర్మానాలు చేసింది. రాష్ట్ర రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంతంలోనే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం - హైకోర్ట్ ఏర్పాటు చేయాలని ఆ డిక్లరేషన్ లో డిమాండ్ చేశారు. ఇది ఈ ప్రణాళికా కాలంలోనే టిడిపి ప్రభుత్వ పాలనా సమయం పూర్తయ్యేలోగానే అమలు చేయాలని కోరింది. అలాగే వచ్చే బడ్జెట్లో రాయలసీమకు రూ.20వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది. ఈ రాయలసీమ ప్రాంత బాజపా సభ్యులు ఈ కర్నూల్ సమావేశం లో ఈ డిక్లరేషన్ ను విడుదల చేశారు.
ఆరు నెలలకు ఒకసారి రాయలసీమ, రెండవ రాజధాని లో శాసనసభా సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. నాలుగు జిల్లాలను ఎనిమిది జిల్లాలు చేయాలని కూడా బీజేపీ సూచించింది. అధికార మంతా ఒకేచోట కేంద్రీకృతం కాకూడదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. రాయలసీమకు హైకోర్ట్ సాధన కోసం ఫిబ్రవరి 28న కడపలో ఆందోళన చేపడతామని బాజపా నేతలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం గత నాలుగేళ్ళపాలనలో అభివృద్ది, అవకాశాలు అంతా అమరావతి పై కేంద్రీ కరించి రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
బడ్జెట్లో ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర అన్యాయం అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్లు ఉద్యమ రూపం దాల్చే సమయంలో ఊపందుకుంది. ఈ నేపథ్యం లో బీజేపీ ‘రాయలసీమ డిక్లరేషన్’ ఆసక్తికరంగా మారింది. ప్రజల దృష్టిని ప్రత్యేక హోదా అంశం నుంచి దారి మళ్లించిందుకే కమలం పార్టీ ఈ నాటకానికి తెరతీసిందని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.
తన మిత్రపక్షం టిడిపి తో బాజపా తెగతెంపులు చేసుకోవటానికే నిశ్చయించుకున్నట్లు - తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలతో కలసి తమకు వ్యతిరేఖంగా చేసే కుట్రలకు బాజపా చెక్ చెప్పే పెద్ద వ్యూహమే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ మద్య టిడిపి రాష్ట్రం లోపలా వెలుపలా బాజపాకు వ్యతిరేఖంగా చేస్తున్న కుట్రలను పరిగణనలోకి తీసుకోని నిశితంగా గమనిస్తూ సిద్ధం చేసిన ఈ వ్యూహం ఏపిలోని అన్నీ రాజకీయ పార్టీలను ఒక్కసారిగా కలవరపరిచింది.
హైదరాబాద్ కేంద్రంగా అన్నీవ్యవస్థలు, సంస్థలు, పారిశ్రామిక, ఆర్ధిక, వ్యవసాయ పరిశోధన, వైద్య ఆరోగ్యం ఇలా అన్నీ ఒకేచోట కేంద్రీకరించటం వలనే రాష్ట్రంలో అభివృద్ది సమతౌల్యత దెబ్బదినటం దానితో పాటు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ వాసులు చేసిన సాంస్కృతిక, సైద్ధాంతిక, బాష, భూ, మౌలిక వసతులు, వ్యాపార, ప్రభుత్వ కాంట్రాక్టులు మొదలైన విభాగాల్లో దోపిడీయే సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ విభజనకు దారితీసి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందన్న విషయం టిడిపి అధినేతకు తెలియంది కాదని అయినా ఆయన స్వార్ధపూరితంగా ఒక ప్రాతనంపై, ఒక వర్గంపై ప్రేమ పెంచు కొని అటు ఉత్తరాంధ్రను ఇటు రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారని బాజపా వాళ్లు అంటున్నారు.
"ప్రత్యేక హోదా" సంజీవని కాదని, ప్రత్యేక పాకేజీలో ప్రత్యేక హోదా ప్రయోజనాలకు మించే అన్నీ నిబిడీకృతమై ఉన్నాయని" పదే పదే అటు శాసనసభలోను, ఇటు బయట సమావేశాల్లోను ప్రవచించిన చంద్రబాబు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయన కుటిల రాజకీయాలను ఓ కంట కనిపెట్టాలని ప్రజలకు విఙ్జప్తి చేశారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు బాజపా లక్ష్యమని దాన్ని అనుసరించే తాము ప్రత్యేక రాయలసీమ గురించి మాట్లాడుతున్నామని అన్నారు.
రాయల సీమలో రైతుల ఆత్మహత్యలు, వలసలను అరికట్టేందుకే బడ్జెట్ లో 20 వేలకోట్లు కోరుతున్నమని అన్నారు. అలాగే కేంద్రం అందించిన సాయంపై శ్వెతపత్రం విడుదలచేయాలని కోరారు. తద్వారా ఆ సాయంలో రాష్ట్ర వైశాల్యంలో రాయలసీమ నిష్పత్తిలో నిధులను ఖర్చుపెట్టినది లేనిది ధృవీకరించాలని ఆ డిక్లరేషన్ కోరుతుంది. అంతేకాదు మహనీయుడు నాడు ఎన్ టి రామారావు విశ్వసించి ప్రారంభించిన గాలేరు-నగరి, హంద్రి-నీవా, గురు రాఘవేంద్ర ప్రోజెక్టు పూర్తి చేయ్యాలని కోరారు. రాయలసీమ వాసులకు టిడిపి చేసిన 200 వాగ్ధానాలు అమలు చేయాలని చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేస్తానన్న 5000 కోట్ల రూపాయిల సంక్షేమ నిధి వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు అనటం కంటే హెచ్చరించారు.
BJP Springs Rayalaseema Card Against TDP Government & Check to CBN "back-ground politics"
బాజపా రాయల సీమ ప్రాంత బాజపా నాయకుడు కపిల ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ 70 మంది రాయలసీమ ప్రాంత నాయకులు ఈ కాంక్లేవ్ కు హాజరైనట్లు చెప్పారు. తెలుగుదేశం నాయకుల అవినీతి తారస్థాయికి చేరిందని అందులో ముఖ్యమంత్రి పాత్ర ఉండబట్టే వారిపై చర్యలకు ఉపక్రమించట్లేదని ఆ నాయకులు అంటున్నారు. దీనికి సాక్ష్యం మార్కెటింగ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాటలేనని అన్నారు.