ఓ వైపు కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గద్దె దింపాలని అనుకుంటుంటారు టీ కాంగ్రెస్ నేతలు. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఎన్నికల్లో గెలవనే లేదు...అప్పుడే తామే ముఖ్యమంత్రులం అని కొట్టుకు చస్తుంటారు. పేరుకే టీ కాంగ్రెస్ ఒక్క పార్టీ అయినా ఇక్కడ సీఎం సీటు కోసం ఏకంగా ఓ 10 మంది వరకు నేతలు లైన్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. ఇక వచ్చే సాధారణ ఎన్నికలకు మరో యేడాది మాత్రమే టైం ఉండడంతో ఎవరికి వారు ఇప్పుడిప్పుడే కంప్లీట్ పాలిటిక్స్లో మునిగిపోయేందుకు రెడీ అవుతున్నారు.
టీ కాంగ్రెస్లో ఎవరికి వారు తమ నియోజకవర్గానికో లేదా తమ జిల్లాకు పరిమితమయ్యే నాయకులే తప్పా కేసీఆర్ను ఎదుర్కొనే స్టేట్ వైడ్ ఛరిష్మా ఉన్న లీడర్ ఒక్కరంటూ ఒక్కరూ లేరు. ఒకరిద్దరు పేరున్న నేతలు, పార్టీని ముందుండి నడిపిస్తున్న వారు ఉన్నా వారికి కేసీఆర్ను ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తెచ్చే సీన్ ఉందా ? అంటే ముమ్మాటికి నో అన్న ఆన్సరే టీ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. ఇదిలా ఉంటే పార్టీలో సీనియర్లలో చాలా మంది ఇప్పటికే ఆరు పదులు దాటేస్తే మరి కొంత మంది ఆరున్నర పదుల వయస్సును కూడా క్రాస్ చేసేశారు. ఈ క్రమంలోనే వీరంతా వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. అప్పుడే ఎవరికి వారు తమ వారసులకు కావాల్సిన సీట్లపై కన్నేసి ఖర్చీఫ్లు వేసేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఈ సీనియర్లకు ఓ సీటు, వీరి తనయులకు మరో సీటు కావాలన్నదే వీరి కండీషన్. మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ గత ఎన్నికల సమయంలోనే మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ వీలుకాలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ తరపున పోటీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన అక్కడ తన పని స్టార్ట్ చేసేశారు. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ గత ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి మాత్రం సబిత మహేశ్వరం నుంచి పోటీ చేస్తే, కార్తీక్రెడ్డి రాజేంద్రనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన కోడలు వైశాలిని జనగామ నుంచి అసెంబ్లీకి దింపి, ఆయన భువనగిరి ఎంపీగా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. మరో మాజీ మంత్రి డీకే అరుణ తన కుమార్తె స్నిగ్ధారెడ్డిని మహబూబ్నగర్ నుంచిగానీ, మరో చోట గానీ అసెంబ్లీ బరిలో దింపనున్నారు. ఇక అరుణకు గద్వాల్ సీటు ఎలాగూ ఉంది. మరి వీరి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో ? గాని అప్పుడే ఈ సీనియర్లు వారసుల సీట్ల కోసం మాత్రం ఖర్చీఫ్ వేసేసి ప్రయత్నాలు ముమ్మరం చేసేశారు.