మిలియన్ మార్చ్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది తెలంగాణ ఉద్యమం. తెలంగాణలో ఆంధ్రుల పెత్తనంపై తిరగుబాటు చేసిన సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాక జై తెలంగాణ అనే నినాదంతో పెద్ద ఎత్తున్న ఉద్యమం కొనసాగింది. సకల జనుల సమ్మెతో ప్రభుత్వం సంస్థలు అన్నీ మూత పడ్డాయి. ఇలా ఎన్నో రకాల ఉద్యమాలు ఓ వైపు మరోవైపు తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలు ఇలా ఢిల్లీ పీఠాన్ని కదిలించాయి. మొత్తానికి యూపీఏ హయాంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
తాజాగా మరోసారి మిలియన్ మార్చ్ తెరపైకి వచ్చింది. టీజేఏసీ చైర్మన్ కోదండరాం తలపెట్టిన 'మిలియన్ మార్చ్ స్ఫూర్తి'కి ప్రభుత్వం అనుమతినివ్వకపోవడంతో ప్రజల్లో వాడి వేడి చర్చ జరుగుతోంది. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేయడం గమనార్హం. ఉద్యమ కాలంలో ఆనాడు ప్రజలందరు కలిసి అద్భుతంగా విజయవంతం చేసిన కార్యక్రమం మిలియన్ మార్చ్. ఉద్యమకారులకు, ప్రజలకు అదో మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది.
అలాంటి చారిత్రక సందర్భాన్ని మరోసారి గుర్తుచేసుకుని స్ఫూర్తి పొందేందుకు కోదండరాం 'మిలియన్ మార్చ్ స్ఫూర్తి' సభను తలపెట్టారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు కోదండరాం రెడీ అవుతున్నారు. టీజేఏసీ నేతలు కోదండరాం ఇంటికి చేరుకుంటున్నారు. అయితే కోదండరాం ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.ఇప్పటికే కోదండరాం ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ట్యాంక్ బండ్ఫై మిలియన్ మార్చ్కు అనుమతి ఇవ్వకపోవడంపై కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నేపథ్యంలో ట్యాంక్ బండ్ చుట్టూ వేలాది పోలీసులను మోహరించింది ప్రభుత్వం. ఉదయం 11గం. నుంచి సాయంత్రం 5గం.ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించింది. అలాగే చుట్టుపక్కల ఉన్న లుంబినీ, ఎన్టీఆర్, లేక్ వ్యూ, సంజీవయ్య పార్కులను కూడా మూసివేయించింది. ట్యాంక్ బండ్ ఎలాంటి సభలకు అనుమతి లేదని, ఒకవేళ ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.