మంత్రి మండలి నుండి అటు కేంద్రంలో టిడిపి మంత్రులను ఇటు రాష్ట్రంలో బిజెపి మంత్రులను ఇరువర్గాలు ఉప సంహరించుకున్న తరవాత ఇద్దరి మద్య మాటల యుద్ధం మొదలైంది. ఏపి ముఖ్యమంత్రి శాసనసభను బహిరంగ సభ చేసి బిజెపి పై శాపనార్ధాలు పెట్టటమనేది ఒక దిన చర్యగా మారింది. అలాగే బిజెపి మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి నుండి మంత్రిమండలిలోని వారందరిని ఏకి పారేస్తున్నారు.
మైత్రి సరిగా ఉన్నరోజుల్లో ఒకరినొకరు సన్మానాలు పొగడ్తలు చేసూన్న వీరు వారి మైత్రి పెటాకులవగానే "కూరిమికల దినములలో.... అన్నట్లు మైత్రి నెఱపిన కాలము నాటి మంచిపనులు ఇప్పుడు సరిగా వ్యతిరేఖంగా కనిపిస్తూ ప్రజలు భరించలేనంత శబ్ధకాలుష్యం ఇరుపక్షాలు వ్యాపింపచేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో భయంకరమైన అవినీతి ఆనిరంగాల్లో క్షేత్రస్థాయిలో నుండే జరుగుతోందని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. ఆయన నిన్న శుక్రవారం కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాస్పత్రిలో 90 యంత్రాలు పని చేయడం లేదు. అవి పని చేయక పోయినా ముఖ్యమంత్రి 'డాష్ బొర్డు' లో పనిచేస్తున్నట్లు నమోదైందని, 'టీబీఎస్ సంస్థ' ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాల మెయింటెనెన్స్ బాధ్యతలు టెండర్ ద్వారా తీసుకుంది. టీబీఎస్కు ఎక్కడా లేని విదంగా రూ.103 కోట్లు మొబిలైజేషన్ ద్వారా, బిల్లుల రూపేణా రూ. 45 కోట్లు చెల్లించారన్నారు. సదరు సంస్థ ఓ మంత్రి గారి బంధువుది కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నట్లు మండి పడ్డారు. టీబీఎస్ కాంట్రాక్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టాయిలెట్స్ నిర్మాణం, ఎన్ఆర్జీఎస్ లో అవినీతిని బహిరంగపరుస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.
రాష్ట్రంలో అవినీతిని చూసి విదేశీ సంస్థలు కూడా భయపడుతున్నాయని, విదేశీ బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ముందుకు రాకపోతే స్వదేశీ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాల్సి వస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి అమరావతికే పరిమితం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు బానిసలుగా చూస్తున్నారని, సీమకు వచ్చిన పరిశ్రమలు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పాలన మొత్తం తండ్రి, కొడుకుల చేతుల్లోనే వారి ఆదేశాలపైనే నడుస్తూ ఉందని అందుకే మిగిలిన మంత్రులంతా నాంకే వాస్తే ఉన్నారని అందరూ డమ్మీలుగా మారారని విమర్శించారు. కేఈ, చిన్నరాజప్పలు కేవలం పేరుకే ఉప ముఖ్య మంత్రలని వారికి ఎలాంటి అధికారాల్లేవన్నారు. ముఖ్యమంత్రి తన అసమర్థతను కప్పిపుచ్చు కునేందుకు కేంద్రాన్ని నిందిస్తు కాలం వెళ్ళబుచ్చుతు ఉన్నారని మండిపడ్డారు.
ప్రత్యేక ప్యాకేజీపై ప్రధానిని గతంలో చంద్రబాబు అభినందించి, ఇపుడు యూ-టర్న్ తీసుకున్నారన్నారు. కాంగ్రెస్తో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు లాలూచీ పడుతున్నారని,సోనియా గాంధీతో ఎందుకు రహస్య మంతనాలు జరుపు తున్నారని ప్రశ్నించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. శుక్రవారం కర్నూలు బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సోనియాతో రహస్య మంతనాలు సాగిస్తుండడం వల్లే చంద్రబాబు నాయుడు బీజేపీకి దూరమయ్యారని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెంచకపోవడంతో, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లు అడుగు తుందనే ఎన్డీఏ నుంచి వెళ్లిపోయారని అన్నారు.
2004లో చంద్రబాబు కారణంగానే వాజపేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓడిందని, కాంగ్రెస్ పదేళ్ల పాలనకు ఆయనే కారకుడయ్యాడని ఆరోపించారు. గతంలో మోదీని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు తిడుతున్నారని, అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.