ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ల శాసన సభ్యత్వం రద్దు చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నేతలు నూతనోత్సాహంతో ఉన్నారు. ఈతీర్పు వారిలో ఐక్యతను పెంచినట్లు కనిపిస్తోంది. ఎప్పుడు గ్రూపుల లొల్లితో గెలిచే అవకాశాలున్న స్థానాల్లోనూ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి నుంచి నేతలు బయటపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. శాసనసభ్యత్వాల రద్దు వ్యవహారంలో హైకోర్టులో ఊరట పొందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్తోపాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ నేతలు మర్రి శశిధర్రెడ్డి, దాసోజు శ్రవణ్, న్యాయవాది జంధ్యాల రవిశంకర్లు శుక్రవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ఆధ్వర్యంలో పార్టీ జాతీయ అధ్యక్షడు రాహుల్ను కలిశారు.
సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టులో విజయం సాధించిన పరిణామాలపై రాహుల్గాంధీకి వివరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి, సంపత్ను రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. కోమటిరెడ్డిని ఆలింగనం చేసుకుని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని ఈ బృందానికి సూచించారు. రాహుల్ నుంచి ఊహించని రీతిలో ప్రశంసలు రావడంతో కాంగ్రెస్ నేతలు మరింత ఉత్సాహంతో ఉన్నారు. ఈ సందర్భంగానే కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రూపులకు అతీతంగా పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తామని కోమటిరెడ్డి అన్నారు. శాసనసభను అవమానించిందే టీఆర్ఎస్ పార్టీ.. అంటూ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు స్ఫూర్తితో అన్ని విషయాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని రాహుల్ సూచించినట్టు సంపత్ కుమార్ తెలిపారు. గ్రూపులకు అతీతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనడంతో దాదాపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ స్వాగతించినట్లు సమాచారం.
ఎప్పుడూ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉంటే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నుంచి ఇలాంటి సానుకూల స్పందన వస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే రాహుల్ నుంచి మార్కులు కొట్టేసిన కోమటిరెడ్డి ఇక రాష్ట్రవ్యాప్త యాత్రకు లైన్ క్లియర్ అయినట్టేననే టాక్ వినిపిస్తోంది. ఇదే ఉత్సాహంతో యాత్ర చేపట్టి, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. నిజంగానే కోమటిరెడ్డి యాత్ర చేపడితే సీనియర్లు స్వాగతిస్తారో లేదోమరి.