తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి నేతల వలసలు ఆగడం లేదు. నేతలు పార్టీని వీడడం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో పార్టీ పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. టీటీడీపీ రాష్ట్ర మహానాడు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నవేళ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే పార్టీని వీడనున్నట్లు వార్తలు రావడం కలకలం రేపుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కొంతకాలంగా తన విషయంలో, ఏపీలోని బీసీల విషయంలోనూ అనుసరిస్తున్న విధానాలపై గుర్రుగా ఉన్న కృష్ణయ్య ఇక టీడీపీకి రాంరాం చెప్పడమే మేలనే నిర్ణయానికి వచ్చారు.
బీసీలంటే చంద్రబాబుకు చులకన భావం ఉందని, అందుకే ఆ పార్టీని వదిలిపెట్టాలని తాను భావిస్తున్నానని సన్నిహితులకు చెబుతున్నారు. నిజానికి ఆర్ కృష్ణయ్యకు మొదటి నుంచీ గుర్తింపు సమస్య వెంటాడుతోంది. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే కృష్ణయ్యను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన చంద్రబాబు.. తర్వాత ఆయనకు కనీసం పార్టీ శాసనసభాపక్ష నేత హోదా కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఏ ముఖ్య పదవుల్లో కూడా ఆయన పేరును ప్రస్తావించలేదు బాబుగారు. దీంతో బాబు వైఖరిపై కృష్ణయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎల్బీనగర్లో కానీ, ఇతరత్రా సమావేశాల్లో పాల్గొన్నా టీడీపీ కండువా ధరించకుండా, కేవలం బీసీల కండువా కప్పుకుంటూనే వచ్చారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన పలు సమస్యలపై మాట్లాడినప్పుడు కూడా తెలుగుదేశం ప్రస్తావన తీసుకురాకుండా స్వతంత్రంగానే ఉండేందుకు ప్రయత్నించారు. ఇలా మొదటి నుంచీ చంద్రబాబు, కృష్ణయ్యల మధ్య అస్సలు పొసగడం లేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల క`ష్ణయ్య మాట్లాడుతూ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీ వీడేందుకుక సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితితోపాటు ఏపీలో సీఎం చంద్రబాబు బీసీలపై అనుసరిస్తున్న వైఖరి కూడా కృష్ణయ్యకు నచ్చడం లేదని సన్నిహితులు అంటున్నారు.
నాలుగేళ్లలో బీసీలకు ఉపయోగకరమైన ఒక్క పథకం చేపట్టకపోవడంపై, రెండుసార్లు రాజ్యసభ ఎన్నికలు జరిగినా ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై బీసీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఇదే సమయంలో న్యాయమూర్తులుగా ఎంపికైన బీసీ న్యాయవాదులు పనికిరారని చంద్రబాబు ఓ నివేదిక ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో ఇక ఆ పార్టీలో కొనసాగడం ఎంతమాత్రమూ మంచిదికాదనే అభిప్రాయానికి కృష్ణయ్య వచ్చినట్లు సమాచారం.