తెలంగాణ అధికార పార్ట్ టీఆర్ఎస్ లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలయిపోయింది. ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో తెలియదు కానీ నాయకులు మాత్రం ముందుగానే తమ తమ సీట్లు రిజర్వు చేసుకునే పనిలో పడ్డారు. ఈ సమయంలోనే పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు బయటకి వస్తోంది. పిల్లుల పోరు ఎలుకకు వరం అయినట్టు టీఆర్ఎస్ నాయకుల కుమ్మకులాటలు ప్రతిపక్ష పార్టీలకు కలిసివస్తోంది. టిక్కెట్ల కోసం ఎవరికివారు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో సిట్టింగ్లు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే లెక్కకు మించి నాయకులను పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా చేర్చేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఎన్నికల నాటికి ఈ టికెట్ల పంచాయతీ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
కేసీఆర్ కి తలనొప్పులు బాగా ఎక్కువయ్యాయి. ప్రతి చోటా ... సొంత పార్టీ నేతల నుంచే టిక్కెట్ల కోసం పోటీ ఏర్పడటంతో ఎమ్మెల్యేలకు మింగుడుపడడంలేదు. ఓవైపు విపక్షాల నుంచి పోటీ, మరోవైపు సొంత పార్టీల నుంచి ముప్పుతో టెన్షన్ పడుతున్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహనం కోల్పోతున్నారు. వీధికెక్కి మారీ పార్టీ పరువు గంగపాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఈ తలపోట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి.
అదే నియోజవర్గం నుంచి మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య, ఎర్రబెల్లి ప్రదీప్రావు, వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ సహా పలువురు నేతలు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇందుకోసం హైకమాండ్ పెద్దల వద్ద గట్టిగానే పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారాన్ని కొండా సురేఖ సహించలేకపోతున్నారు. అందుకే ఆమె సొంత పార్టీ నేతలపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసేందుకు కూడా వెనకడుగు వేయడంలేదు. కొత్తగా మీసాలు మెలిపెడితే... ఉన్నవి ఊడతాయంటూ పదునైన డైలాగులు కూడా వేయడం రాజకీయ సంచలనం సృష్టించింది.
టీఆర్ఎస్కు చెందిన గువ్వల బాలరాజుకు అచ్చంపేటలో ఇదే తరహా పోటీ నెలకొంది. టీడీపీ నుంచి చేరిన మాజీ మంత్రి రాములు ఇక్కడ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో అలంపూర్ నుంచి మందా జగన్నాథం కుమారుడు శ్రీనాధ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇటీవల టీడీపీ నేత డాక్టర్ అబ్రహం టీఆర్ఎస్లో చేరారు. టిక్కెట్ తనదేనన్న ధీమాతో అబ్రహం ప్రచారం కూడా ప్రారంభించేశారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ గొడవలు రచ్చకెక్కాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉండగా కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితతో పాటు మరికొందరు టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీనితో వీరిపై శంకర్ నాయక్ ఘాటైన వ్యాఖ్యలే చేశారు.
కొందరు నేతలు చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారంటూ నోరు పారేసుకున్నారు. బ్రోకర్ల వెంట తిరగకండి జీవితాలను నాశనం చేసుకోకండి అంటూ సొంతపార్టీ నేతలకు హెచ్చరికలు చేస్తున్నారు. అధికార పార్టీలో నెలకొన్న ఈ తగాదాలు ఎలా పరిష్కరించాలో తెలియక కేసీఆర్ కూడా తలపట్టుకుర్చున్నాడు. ముందస్తు ఎన్నికలు వస్తే తెలంగాణ అంత కారు గిరగిరా తిప్పాలని చూస్తుంటే నాయకుల గొడవలు స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడుతున్నాయని కేసీఆర్ ఆందోళన చెందుతున్నాడు. ఇదంతా ఆపరేషన్ ఆకర్ష్ ఎఫక్టేమో