టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కు వైసీపీ అధినేత జగన్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు.. కేంద్రంతో వైసీపీ అంటకాగుతోందంటూ పదేపదే బాబుగారు చేస్తున్న ఆరోపణలకు ఒక్క నిర్ణయంతో బుద్ధి చెప్పారు.. తాను రాజకీయ ప్రయోజనాలు లేవనీ, కేవలం రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయమని జగన్ తేల్చిపారేశారు.. నాలుగేళ్లపాటు కేంద్రంతో సంసారం చేసి.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా వ్యవహరించి.. ఆంధ్రుల హక్కులను కాలరాసి.. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న యూటర్న్ బాబుకు జగన్ సరైన సమయంలో పెద్దషాక్ ఇచ్చారు.. దీంతో వైసీపీపై చంద్రబాబు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమేనన్న విషయం ఇప్పుడు స్పష్టమైపోయింది.
కేంద్రంతో నాలుగేళ్లు సంసారం చేసిన... నీతి ఆయోగ్సమావేశంలో ప్రధాని మోడీ ముందు వంగివంగి భక్తిభావం చాటిన బాబును ఆంధ్రులెవరైనా అంత సులభంగా మరిచిపోగలరా..! ఇంతకీ జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటని ఆలోచిస్తున్నారా..? అదేనండీ.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ వద్ద పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఆదివారం వర్షం కారణంగా పాదయాత్రను రద్దు చేసుకున్నారు. అయితే, అక్కడే తాను బస చేస్తున్న శిబిరంలో పార్టీ అత్యున్నత కమిటీ సభ్యులతో జగన్ సమావేశమయ్యారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆయన బృంద సభ్యులతో చర్చించి బీజేపీకి మద్దతు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఇన్నిరోజులుగా వైసీపీపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ ఆరాటపడుతున్నారన్న విషయం మరోసారి తేలిందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. తాను అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారన్నది ఆంధ్రులందరికీ తెలిసిందే.. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పింది చంద్రబాబే.. ఇప్పుడు అదే హోదా కోసం ఉద్యమిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నదీ ఆయనే.
మొదటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఉద్యమిస్తున్న వైసీసీ, ఇతర పార్టీలపై పోలీసులతో లాఠీచార్జి చేయించి, అరెస్టులు చేయించింది చంద్రబాబే.. ఇప్పుడు ఆయన అధికారాన్ని అడ్డంపెట్టుకుని, పోలీసులను కాపాలగా ఉంచుకుని ధర్మపోరాట దీక్షల పేరుతో ఉద్యమిస్తున్నామని చెప్పుకుంటున్నదీ ఆయనే.. ఇలా నాలుగేళ్లో చంద్రబాబు తీసుకున్న యూటర్న్లు ఎన్నో.. ఒక్కమాటపై నిలబడకుండా.. దాటవేత ధోరణితో ఆంధ్రులకు అన్యాయం చేసుకుంటూ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న బాబుపై ఆంధ్రులు మండిపడుతున్నారు.