కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహా పురుషులవుతారూ..అంటూ ఓ పాట గుర్తుంది కదా..ఒక టీ అమ్మే అబ్బాయి భారత దేశాన్ని తన భుజస్కందాలపై మోసే ప్రధాన పదవి అలంకరించి ప్రపంచ దేశాల్లో తనదైన ముద్ర వేసే స్థాయికి చేరుకున్నారు..ఆయన ఎవరో ఈపాటికి మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది.. అవును మన భారత ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మూడు సంవత్సరాల తరువాత దేశం గణతంత్రంగా అవతరించిన కొద్ది నెలల్లో, అంటే 1950 సెప్టెంబర్ 17 నాడు నరేంద్ర మోదీ జన్మించారు. మోడీ ఆరో ఏటనుండి ఉదయం తండ్రికి సహాయం చేసి పాఠశాలకు వెళ్ళేవాడు.
నరేంద్ర మోడీ ఎనిమిదవ ఏట రాష్ట్రీయ స్వాయంసేవక్ సంఘములో చేరారు. ఉదయం తండ్రికి టీ కొట్టు నడపడంలో సహాయం చేయడం, స్కూలికి వెళ్ళడం సాయంత్రం ఆర్.యస్.యస్ కి వెళ్ళడం మోడీ దినచర్యగా ఉండేది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీవన యానం ఉత్తర గుజరాత్ లోని మెహసానా జిల్లా లోని వాద్ నగర్ పట్టణం నుండి మొదలైంది. నరేంద్ర మోదీ బాల్యం పూల పాన్పు కాదు.. సమాజంలోని అట్టడుగు వర్గాల నుండి వచ్చిన కుటుంబం కావడంతో జీవితం గడవడానికి ఎంతగానో కష్టపడ్డారు.
కుటుంబం మొత్తం ఒక చిన్న ఇంట్లో ఉండే వారు ( సుమారు 40 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు గల ఇల్లు వీరిది). వీరి తండ్రి గారు స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసుకొన్న టీ స్టాల్లో టీ ని విక్రయించే వారు. బాల్యం లో తాను గడిపిన జీవితం నరేంద్ర మోదీపై గాఢమైన ముద్రను వేసింది. నరేంద్ర మోదీ తన తండ్రికి సహాయపడుతూనే చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తండ్రికి సహాయపడడం, చదువు, ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఆయన సమతూకంతో వ్యవహరించారు.
చదువు, వక్తృత్వం పట్ల ఆసక్తి, దేనినైనా సాధించాలనే పట్టుదలగల వ్యక్తిగా శ్రీ నరేంద్ర మోదీని ఆయన చిన్ననాటి మిత్రులు గుర్తు చేసుకుంటారు.నరేంద్ర మోదీకి అన్ని సముదాయాల నుండీ ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. ఆయనకు ఇరుగు పొరుగున ఎంతో మంది ముస్లిం మిత్రులు ఉండే వారు. అందువల్ల తరచుగా హిందూ, ముస్లిముల పండుగలను జరుపుకొనే వారు.ఆయన ఆలోచనలు, కలలు ఎంతో ఉన్నతంగా ఉండేవి. అలా తరగతి గదిలో ప్రారంభమైన ఆలోచనలు ఆయన దేశ ప్రధాన మంత్రి పదవిని చేపట్టే స్థాయికి నడిపించాయి.సమాజంలో మార్పు తీసుకురావాలని, ప్రజల కష్టాలను తొలగించాలని వారు సంకల్పించారు.
పాఠశాల గ్రంథాలయంలో గంటలకొద్తీ పుస్తకాలు చదువుతూ ఉండేవారు. 18 ఏళ్ల వయసులో మోడీ సంన్యాసం తీసుకుంటాను అని ఇంట్లోనుంచి వెళ్ళిపోయారు. రెండు ఏళ్ల తర్వాత ఆయన తిరిగి వచ్చి అహ్మదాబాదులో ఆయన మామయ్య యొక్క బస్సు స్టాండ్ లోని టీ కొట్టు లో పనికి చేరారు. కొన్ని రోజుల తర్వాత స్వయంగా ఒక టీబండి ద్వారా టీ అమ్మడం ప్రారంభించారు. కొన్ని రోజులు గడిచాక ఆయన రాష్ట్ర కార్యాలయములో ఒక పనివాడిగా చేరారు. కార్యాలయములో అందరికి ఉదయం టీ, టిఫిన్ తయారు చెయ్యడం తర్వాత కార్యాలయము శుభ్రం చెయ్యడం ఆయన పనిగా ఉండేది.
యువకుడిగా ఉన్నప్పుడు వారు ఐహిక సుఖాలకు దూరంగా ఉండే ఆలోచనలు చేశారు. వంటనూనెల వాడకం, ఉప్పు, కారం, పులుపు వస్తువులు.. వీటిని త్యజించారు. స్వామి వివేకానంద రచనలను ఆమూలాగ్రం చదివారు. అది ఆయనను ఆత్మ స్వరూపతత్వాన్ని తెలుసుకునే దిశగా నడిపించింది. స్వామి వివేకానంద కన్న జగద్గురు భారతదేశపు కలను సాకారం చేయాలన్న సంకల్పానికి ఆయనలో అప్పుడే పునాది పడింది. శ్రీ నరేంద్ర మోదీ బాల్యం నుండి ఆయనను అంటిపెట్టుకొని వారి జీవితంలో కొనసాగుతూ వస్తున్నది ఆయనలోని సేవాతత్పరత.