ప్రజావ్యతిరేకత ఎంతటి వారినైనా ఓడిస్తుంది. అందుకు ఎలాంటి నేతలైనా మినహాయింపు కాదు. ఈ విషయం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మరోసారి రుజువైంది. ఎన్నికల్లో ముఖ్యమంత్రే ఓడిపోతే.. నిజంగా అది సంచలనమే. అలాంటి విచిత్రం మిజోరం ఎన్నికల్లో జరిగింది.
మిజోరం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత లాల్ తన్హావ్లా ఓడిపోయారు. చాంపై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లాల్... మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి టీ జే లాల్నుత్లుంగా చేతిలో ఓటమిపాలయ్యారు. కేవలం 856 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ముఖ్యమంత్రే ఓడిపోయారంటే ఇక ఆ పార్టీ మాత్రం గెలుస్తుందా.. మిజోరంలో అధికార కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది. 40 నియోజకవర్గాలున్న మిజోరంలో మెజారిటీ మార్కు 21. ఈ మార్కు ఇప్పటికే మిజో నేషనల్ ఫ్రంట్ సాధించింది. కాంగ్రెస్ చేతి నుంచి మిజోరం కూడా చేజారిపోయింది.