రాజకీయ ఖిల్లా.. విజయవాడలో పొలిటికల్ హీట్ భారీగా పెరిగింది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్తానం ఉన్న ఈ నగరంలో .. పార్టీలు వేటికి అవే దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీకి మంచి కేడర్, గట్టి పట్టు ఉండడంతో ఇక్కడ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రతి ఒ క్కరినీ కలుపుకొని పోతున్నారు. రెండు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. తూర్పులో గద్దె రా మ్మోహన్, సెంట్రల్లో బొండా ఉమాలు విజయం దిశగా వడివడిగా పరుగులు పెడుతున్నారు. ఇక, మరో కీలక నియోజక వర్గం పశ్చిమలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానాఖతూన్ పోటీ చేస్తున్నారు.
ఇక, ఇక్కడ నుంచి వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ బరిలో నిలిచారు. ఇక, ఈ ఇద్దరు నాయకులే కాకుండా బలమైన సామాజిక వర్గానికి చెందిన, ప్రముఖ పారిశ్రామిక వేత్త కోరాడ విజయ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. జనసేన కూడా గట్టి పోటీ ఇస్తోంది. ప్రముఖ నేత పోతిన వెంకట మహేష్ పోటీ చేస్తున్నారు. మిగిలిన పార్టీ లనుంచి కూడా ఒకరిద్దరు పోటీలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం వీరి మధ్యే ఉంటుంది. ఇక, ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఖతూన్కు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని మద్దతు లభిస్తుండడం గమనార్హం. ప్రచార పర్వంలో ఖతూన్కు తోడుగా కేశినేని కుమార్తె శ్వేత కూడా పాల్గొంటున్నారు.
అదేసమయంలో వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా దూకుడుగా ఉన్నారు. గతంలో తానుఎమ్మెల్యేగా ఉన్న సయమంలో చేసిన అభివృద్ధి, వ్యాపార వర్గాల్లో మంచి పట్టు ఉండడం, ముఖ్యంగా మార్వాడీ, వైశ్యులు, వస్త్ర వ్యాపారుల నుంచి మద్దతును కూడ గట్టారు. ఇక, గత అయిదేళ్ల కాలంలో ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా సకాలంలో పూర్తికాలేదని , అవినీతి జరుగుతోందని చేస్తున్న ఆరోపణలు సీరియస్గా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో పశ్చిమ ఫైట్ ఆసక్తికరంగా మారింది. ఒకపక్క, మహిళా నేత, ముస్లిం వర్గాలను మచ్చిక చేసుకుని ముందుకు సాగుతున్న అధికార పార్టీ నేత ఖతూన్, మరోపక్క, వైశ్యవర్గం కార్డును బలంగా ప్రయోగిస్తున్న వెల్లంపల్లి మధ్య హోరా హోరీ సాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు గెలిచినా.. స్వల్ప మెజారిటీనే దక్కుతుందని అంటున్నారు.