ఏపీలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడనుందా ? పార్టీ ఆవిర్భావం నుంచి 1989లో మినహా అన్ని సార్లు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతున్న ఆ నియోజకవర్గంలో ఈ సారి వైసీపీ జెండా ఎగరనుందా అంటే రాజకీయ వర్గాలు అవుననే ఆన్సర్ ఇస్తున్నాయి. కృష్ణా జిల్లాలో నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం చెబితే ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎంత పెట్టని కోటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1983 నుంచి 2014 వరకు జరిగిన సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్నింటిలోనూ తెలుగుదేశం పార్టీ ఘన విజయాలు సాధించింది. ఒక్క 1989లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాలులు బలంగా వీచిన 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది. 2014లో సైతం ఇక్కడ టీడీపీ విజయం సాధించగా ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్రావు మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రభాకర్రావు కుమార్తె ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే సోమ్య 70,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ఏ ఎన్నికలు వచ్చినా నందిగామ అంటే టీడీపీలో ఖాతాలో పడిపోయినట్టే అన్న లెక్క నిన్నటి వరకు ఉండేది. నేటి నుంచి ఆ లెక్క మారినట్టే నియోజకవర్గ వాతావరణం చెబుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో నందిగామ 2009లో ఎస్సీలకు రిజర్వ్డ్ అయ్యింది. అప్పటి వరకు ఆ నియోజకవర్గంపై ఆధిపత్యం చెలాయించిన దేవినేని, వసంత ఫ్యామిలీలు వేరే నియోజకవర్గాలకు మారారు. 2009 నుంచి దేవినేని ఉమా నందిగామ పక్కనే ఉన్న మైలవరం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక నందిగామ జనరల్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వసంత ఫ్యామిలీ ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీలోకి జంప్ చేసి మైలవరంలో ఉమా మీదే పోటీ చేస్తోంది. ఈ నియోజకవర్గంలో వసంత, దేవినేని ఫ్యామిలీలకు మంచి పట్టుంది. మాజీ హోం మంత్రి, సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు ఇక్కడ నుంచి 1972, 1983, 1985 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత మాజీ మంత్రి దేవినేని వెంకట రమణ 1994లో ఇక్కడ నుంచి విజయం సాధించగా ఆయన సోదరుడు ప్రస్తుత మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు 1999, 2004 ఎన్నికల్లో వరుస విజయం సాధించారు.
టీడీపీ సీన్ ఎందుకు రివర్స్ అయ్యింది..?
ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ సీన్ నియోజకవర్గంలో పూర్తిగా రివర్స్ అయ్యింది. ఉప ఎన్నికల్లో గెలిచిన తంగిరాల సౌమ్య నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో పూర్తి నిర్లక్షధోరణితో వ్యవహరించారు. ఆమె పని తీరుపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్రమైన అసంతృప్తి ఉంది. నియోజకవర్గంలో టీడీపీలో సహజంగానే పెత్తనం చెలాయించే ఓ సామాజికవర్గం కనుసన్నల్లోనే ఆమె ఉండిపోయారే తప్పా నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వెయ్యలేకపోయారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నందిగామ సొంత నియోజకవర్గం కావడంతో ఆయన ఆధిపత్యం సహజంగానే ఇక్కడ ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా మొత్తం ఉమా కనుసన్నంలోనే నడుస్తూ వచ్చింది. దీంతో తంగిరాల సౌమ్య సహజంగానే డమ్మీ ఎమ్మెల్యేగా మారిపోయారన్న విమర్శలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలే నిరసనలు చేపట్టారు. అయినా అధిష్టానం ఉమా ఒత్తిడికి తలొగ్గి తిరిగి సౌమ్యకే సీటు కేటాయించింది.
వైసీపీ వేవ్తో పాటు ఐదేళ్ల పాటు మనలో కలిసి ఉన్న జగన్మోహన్రావుకు ఓ ఛాన్స్ ఇవ్వాలన్న మాట ప్రస్తుతం నందిగామలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టీ చూస్తే వైసీపీ గ్యారెంటీగా గెలిచే సీట్లలో నందిగామ చేరిపోయింది. ఇక వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఓడిపోయినా నియోజకవర్గంలో ఐదేళ్ల పాటు కాలికి బలపం కట్టుకుని తిరుగి పార్టీ కేడర్ను కాపాడుకోవడంతో పాటు సాధారణ జనాల్లోనూ సానుభూతి సంపాదించారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేని న్యూట్రల్ ఓటింగ్ అంతా ఇప్పుడు జగన్ మోహన్రావు వైపే మగ్గు చూపుతోంది. ఏదేమైన తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి నందిగామలో వైసీపీ జెండా ఎన్నికలకు ముందే రెపరెపలాడుతోంది. మరి తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.