ఆంధ్రా ఓటరు పోటెత్తాడు. గురువారం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయితే 6 గంటలకే చాలా మంది క్యూలో నుంచిని కసిగా ఓటేశారు. ఆంధ్రా ఓటరుకు అంత కసి ఎందుకు వచ్చింది? తన కసిని ఎవరి మీద తీర్చుకోబోతున్నారు ? అన్న దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. భారీ ఎత్తున జరిగిన పోలింగ్పై ప్రధాన రాజకీయ పక్షాలు ఎవరికి వారు మేకపోతు గాంభిర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందంటే తమకు అనుకూలంగా జరిగిందని ఎవరికి వారు చెప్పుకోవడం సహజం.
అదే టైంలో ఇంత భారీ ఎత్తున జరిగిన పోలింగ్ ప్రత్యర్థి పార్టీలకు మైనస్ అని కూడా వారు చెప్పుకుంటున్నారు. అదే టైమ్లో అధికార టీడీపీ తమ ప్రభుత్వంపై ఉన్న సానుకూలతతోనే ఇంత భారీ ఎత్తన ఓటర్లు ఉదయాన్నే తరలివచ్చి ఓట్లు వేశారని చెబుతుంటే... అధికార పార్టీపై ఉన్న వ్యతిరేఖతో, ఐదేళ్ల పాటు జరిగిన అన్యాయంపై వ్యతిరేఖ ఓటరు పోటెత్తాడని విపక్ష పార్టీ చెబుతోంది. ఇంత భారీ ఎత్తున జరిగిన ఓటింగ్ పాజిటీవ్ వేవ్తో వచ్చిందా ? నెగిటివ్ వేవ్ వల్ల జరిగిందా ? లేదా ఆంధ్రాలో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారంగా జరిగిందా ? అన్న దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. రేపటి ఫలితాల్లో ఈ ఓటింగ్ వార్ వన్ సైడ్గానే ఉంటుందని వచ్చే తీర్పుకు సంకేతంగా పలువురు చెబుతున్నారు.
1983, 1985లో ఎన్టీఆర్ గెలిచినప్పుడు, 1994లో ఎన్టీఆర్ ప్రభంజనం క్రియేట్ చేసినప్పుడు, 1999లో చంద్రబాబు గెలిచినప్పుడు టీడీపీకి పూర్తి సానుకూల ఓటింగ్ జరిగింది. అలాగే 1989, 2004లో కాంగ్రెస్ ప్రభంజనం ముందు టీడీపీ నిలవలేదు. మరీ ఇప్పుడు ఆంధ్రా ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తున్నారన్నది సహజంగానే అందరికి ఆసక్తి ఉంటుంది. 1999లో సానుకూల ఓటుతో గట్టెక్కిన చంద్రబాబు 2004లో వ్యతిరేఖ ఓటుతో చిత్తు చిత్తుగా ఓడారు. 1983, 1985లో చిత్తుగా ఓడిన కాంగ్రెస్ 1989లో ఘన విజయం సాధించింది. అలాగే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంలో టీడీపీ మహామహులు సైతం చిత్తు అయ్యారు.
ఇక 2014లో వచ్చిన ఫలితాలు ఒక విప్లవానికి మార్పు అని చెప్పాలి. ఆ ఎన్నికల్లో ఏపీలో దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యింది. ఇక తాజా ఎన్నికల్లో మహిళలు, పెద్దలు, వృద్దులు, యువత భారీ ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాలు, పోలింగ్ సరళిని బట్టీ చూస్తుంటే ఆధికార పార్టీపై ఉన్న సానుకూలత కంటే వ్యతిరేఖతే ప్రజల్లో ఎక్కువగా వ్యక్తం అయినట్టు కనిపిస్తోంది. రైతుల్లో రుణమాఫీ పోటు స్పష్టంగా ఓటింగ్లో వ్యక్తం అయ్యింది. విద్యార్ధులు, యువతలోనూ మార్పు ప్రస్పుటంగా కనిపించింది.మాస్తో పాటు క్లాస్ వర్గాల్లో కూడా ఓ సారి కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇచ్చి చూస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే వాళ్లు ఓటు వేసినట్టు ఓటింగ్ సరళి చెప్పింది.