ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి పదహారు రోజులు దాటినా ఫలితాలు రావడానికి మరో నెల సుమారు ఒక నెలకు తక్కువ సమయం ఉన్నా రాష్ట్రంలో రాజకీయాల వేడి ఏ మాత్రం తగ్గలేదు. ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఎన్నికలు ముగిసిన తర్వాత జాతీయ రాజకీయాల జోలికి వెళ్లట్లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రెండు, మూడో దశల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేందుకు దక్షిణాది రాష్ట్రాల్ని చుట్టేశారు. కర్ణాటకలో మిత్రపక్షం జేడీఎస్, తమిళనాడు లో మిత్రపక్షం డిఎంకె తరపున ఎన్నికల ప్రచారం సాగించారు. మూడో దశలోనూ అదే జోరు కొనసాగించారు. మిగతా నాలుగు దశల్లో కూడా చంద్రబాబు ఇదే విధంగా దేశ మంతా తిరిగి ఆయా రాష్ట్రాల్లోని మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచారం సాగించిన సంగతి తెలిసిందే.
ఎన్డీఏ అధికారంలోకి రాకూడదనేనా! ఆంధ్రప్రదేశ్లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే, కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అది తమకు ఏమాత్రం కలిసి రాదనీ, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి మరిన్ని కష్టాలు తెస్తారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే, అప్పుడు కేంద్రం లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అప్పుడు టీడీపీ నేతలకు మరిన్ని కష్టాలు తప్పవని చంద్రబాబు లెక్కలేసు కున్నట్లు తెలిసింది.
ఏపీలో అధికారంలోకి వచ్చినా, రాకపోయినా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వస్తే, తమకు చాలా వరకూ కలిసొస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తే, ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, అది తమకు స్వర్ణయుగంగా భావిస్తున్న చంద్ర బాబు, ఒకవేళ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకపోయినా, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతూ రాష్ట్రంలో టీడీపీకీ, ఆ పార్టీ నేతలకూ ఎలాంటి నష్టమూ కలగకుండా జాగ్రత్త పడొచ్చని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది.
ఇవన్నీ ఆలోచించిన చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం రాకూడదన్న కృతనిశ్చయంతో దేశవ్యాప్త పర్యటనలకూ, ప్రచారాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఈసారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాదనీ, మిత్రపక్షాలతో కలిసి మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఉందని టీడీపీ అంతర్గత సర్వేలో తేలినట్లు సమాచారం.
ఐతే, గట్టిగా ప్రయత్నిస్తే, బీజేపీని జాతీయ స్థాయిలో దెబ్బకొట్టడం పెద్ద కష్టమేమీ కాదనీ, ఇప్పటికే హిందీ మాట్లాడే ప్రాంతంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఏలాగూ బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు లేవని భావిస్తున్న చంద్రబాబు, ప్రతీ రాష్ట్రంలోనూ జరిగే, ప్రతీ విడత ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీ టార్గెట్గా బలమైన వ్యతిరేక ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకోవడం వల్లే, ఆయన నిరంతరం పర్యటనలు సాగిస్తున్నారని తెలిసింది.