భారత్ దేశంలో ఎవరైనా సరే క్రిప్టోకరెన్సీలను ఉపయోగిస్తే ఇక జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అది కూడా ఏకంగా పదేళ్లు. డిజిటల్ కరెన్సీ బిల్లు 2019 ఇదే విషయాన్ని చెబుతోంది.
బ్లూమ్బర్గ్ క్వింట్ నివేదిక ప్రకారం ఎవరైనా క్రిప్టోకరెన్సీ కలిగి ఉన్నా, విక్రయించినా, ఇతరులకు బదిలీ చేసినా పెనాల్టీలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ క్రిప్టోకరెన్సీతో లావాదేవీ నిర్వహిస్తే జైలుశిక్ష తప్పేలా లేదు.
క్రిప్టోకరెన్సీల్లో లావాదేవీలు నిర్వహించే వారికి ఇది పిడుగులాంటి వార్తే. భారత్ లోని క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్-ఫామ్స్పై కూడా ప్రతికూల ప్రభావం చూపనుంది. కాగా భారత్ లో క్రిప్టోకరెన్సీల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందని తొలుత అందరూ భావించడం గమనార్హం.
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సారథ్యంలోని ఒక ప్యానెల్ ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టంగా మారి అమలులోకి వచ్చిన తర్వాత 90 రోజుల్లోగా ఎవరి వద్దనైనా క్రిప్టోకరెన్సీ ఉంటే వెల్లడించాల్సి ఉంటుంది. లేదంటే శిక్ష తప్పదు. అలాగే ఈ ప్యానెల్ డిజిటల్ రూపీని కూడా ప్రవేశపెట్టాలని కేంద్రానికి సూచించింది. దీనికి రిజర్వు బ్యాంక్ అనుమతి తప్పనిసరి.