జగన్ చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగారు. జగన్ ఒంట్లో రాజకీయం ఉంది. రాజకీయాలు చూస్తూనే పెరిగారు. రాజకీయాల్లో అన్ని విషయాల గురించి తెలుసుకున్నారు.
2004 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న జగన్, 2009 వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతో కడప నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
ఇదిలా ఉంటె, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్, గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. 2009 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారంతో రాజకీయంలో అప్పట్లోనే చర్చలు మొదలయ్యాయి. పవన్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే దానిపై కథనాలు కూడా వెలువడ్డాయి.
పవన్ ప్రచారం మాత్రమే చేశారు. పార్టీ తరపున పోటీ చేయలేదు. తదనంతరం జరిగిన పరిణామాల కారణంగా ప్రజారాజ్యం 2011 లోనే కాంగ్రెస్ లో విలీనం అయ్యింది. అదే 2011లో జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైకాపా పార్టీని స్థాపించి ప్రజల ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు.
2011 నుంచి జగన్ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేశారు. ఎక్కడా పక్కదారికి పోలేదు. 16 నెలల పాటు జైల్లో ఉన్నా కూడా పార్టీని నడిపించాడు. అదే జగన్ కు కలిసి వచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ అఖండ విజయానికి దోహదం చేసింది.