గడిచిన వారం రోజులుగా రాష్ట్రం పరవశంలో మునిగిపోయింది. ఎవరిని కదిలించినా.. తుళ్లింతే! ఎవరి నోట విన్నా.. మళ్లీ ఆరోజులు వచ్చాయంటూ.. ప్రశంసల జల్లే. ఇదీ ఇప్పుడు ఏపీలో ఏ మూలనైనా కూడా కనిపిస్తున్న పరిస్థితి. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వం మారడమా? పాలనలో ప్రక్షాళన రావడమా? అంటే.. ఈ రెండింటికీ మించిన మరో రీజన్ ఉందని అంటున్నారు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్న ప్రజలు.
రాష్ట్రంలో గడిచిన ఆరేళ్లలో ఏ నాడూ లేని సంబరాన్ని ప్రజలు ఇప్పుడు చేసుకుంటున్నారు. దీనికి ఏకైక రీజన్.. ప్రభుత్వం మారడంతోపాటు.. ప్రకృతి కూడా మారడమే. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టులకు జలకళ సంతరించడమే అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. గడిచిన ఐదేళ్ల కాలంలో అనేక రూపాల్లో కరువు తాండవించింది. పచ్చగా కళకళలాడే ప్రాంతాల్లోనూపైరులు ఎండిపోయి దర్శనమిచ్చాయి. అంతో ఇంతో పండే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో పంటలు పండని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు లబోదిబో మన్నారు.
దాదాపు 1500 మండలాలను కరువు మండలాలుగా అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. వీటికి సంబంధించి కేంద్రం కూడా 1200 మండలాలకు నిధులు ఇచ్చింది. అయితే. అప్పటికే ఆయా మండలాల్లోని ప్రజలు వలస బాట పట్టారు. కూటికోసం వేరే ప్రాంతాలకు తరలిపోయారు. కట్ చేస్తే.. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైంది. ప్రజలు ఓ నమ్మకం ఉంది. రాష్ట్రం వైఎస్ పాలనసాగించిన సమయంలో సమృద్ధిగా నీరు పారుతుందని! అదే ఇప్పుడు నిజమవుతోంది.
దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం! అంటూ.. గొప్ప వ్యాఖ్య చేశారు. వాస్తవానికి జలవనరుల అధికారుల గణాంకాల ప్రకారం దాదాపు 9 ఏళ్లుగా గేట్లు ఎత్తేస్థాయిలో కూడా నీరు చేరని నాగార్జున సాగర్కు ఇప్పుడు గేట్లు ఎత్తక పోతే.. సాగర్ ప్రాజెక్టుకే ప్రమాదం పొంచి ఉందనే స్థాయిలో కృష్ణమ్మ పోటెత్తింది. దీంతో కరువుసీమ రాయలసీమకు కూడా నీటిని మళ్లించేందుకు ప్రభుత్వం యుద్ధ సన్నాహాలు చేసింది.
సీమలోని ప్రతి కుంటను, చెరువును, కాలువను కూడా నీటితో నింపాలని జగన్ ఆదేశించారు. ఇక, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో కృష్ణా, గోదావరుల ప్రవాహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అటు శ్రీశైలం, సాగర్, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల, ధవళేశ్వరం వంటి అన్ని ప్రాజెక్టులూ కళకళలాడుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సెంటిమెంటే నిజమని నమ్ముతున్నారంటే.. అతిశయోక్తి కాదు..! మరి జగన్ చెప్పినట్టు ఇది దేవుడి దయ లేక... ప్రజలు నమ్మినట్టు వైఎస్ జగన్ పాలన రావడమా?!! ఏదేమైనా.. రైతాంగానికి ఊపిరి అందింది..!!