దేశంలో రాజకీయాల్లో చాలా మార్పులు వస్తున్నాయ్. బాబ్రీ మసీదు విషయంలో తీర్పు కీలక దశలో ఉండగా.. అప్పట్లో యూపి ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ ఇప్పటి వరకు ఆ కేసులో కోర్టు ముందు హాజరు కాలేదు. కారణం ఆయన వివిధ హోదాల్లో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండటమే. అల్లర్ల తరువాత యూపి సీబీఐ కోర్ట్ ఈ విషయంలో ఎల్ కె అద్వానీ, జోషి, ఉమాభారతి లకు మినహాయింపు ఇచ్చింది. దీన్ని అలహాబాద్ కోర్టుకూడా సమర్ధించింది.
అయితే 2017లో సుప్రీం కోర్టు ఈ కేసును తిరిగి ప్రారంభించింది. దీంతో ఈ ముగ్గురు కూడా కోర్టుకు హాజరయ్యారు. కళ్యాణ్ సింగ్ పేరును కూడా ఈ కేసులో చేర్చింది. కారణాం బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపి రాష్ట్రానికి కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొన్నటి వరకు కళ్యాణ్ సింగ్ రాజస్థాన్ గవర్నర్ గా ఉండటం వలన ఆయన్ను విచారించేందుకు కుదరలేదు.
కాగా, ఇప్పుడు కళ్యాణ్ సింగ్ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ను నియమించడంతో కళ్యాణ్ సింగ్ ఆ పదవి నుంచి బయటకు వచ్చారు. దీంతో ఇప్పుడు సిబిఐ కళ్యాణ్ సింగ్ ను బాబ్రీమసీద్ కూల్చివేత విషయంలో ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉన్నది. బీజేపీ ప్రభుత్వం కళ్యాణ్ సింగ్ కు ఏదైనా రాజ్యాంగ బద్దమైన పదవి ఇస్తే తిరిగి ఆయన్ను విచారణ నుంచి తప్పించే అవకాశం ఉంటుంది.
కానీ, బీజేపీ ఆ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే, అందరికి ఒకే న్యాయం అనే సూత్రాన్ని పాటిస్తోంది. బహుశా కళ్యాణ్ సింగ్ కు మరో పదవి ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. పైగా అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం అక్కడి ముస్లింలు కూడా సహకరించేందుకు సిద్ధం అవుతున్నారు. దేశంలో మోడీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నది. ఈ సమయంలో కళ్యాణ్ సింగ్ విషయంలో మోడీ ప్రభుత్వం మరో పదవి ఇచ్చే ఆలోచన చేయదు అన్నది వాస్తవం. కళ్యాణ్ సింగ్ విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.